5 పైసల కోసం 40 ఏళ్లుగా పోరాటం : యాదవ్ 'ఓ నిజాయితీ పరుడు'
చిల్లర పనులు.. చిల్లరగాళ్లు.. అంటూ చిల్లర గురించి చాలా చులకన చేసి మాట్లేడుస్తుంటారు చాలామంది. కానీ అదే చిల్లర గురించి, అది కూడా ఇప్పుడు అసలు ఉపయోగంలోనే లేని 5 పైసల గురించి.. ఓ వ్యక్తి చేసిన న్యాయ పోరాటం చూస్తే ఖచ్చితంగా తమ అభిప్రాయం మార్చుకోక తప్పదు. ఐదు పైసలను తన జేబులో వేసుకోవాలని చూశాడన్న అభియోగంతో ఏకంగా 40 ఏళ్లుగా పోరాడం చేసి చివరకు తప్పు తనది కాదని నిరూపించుకున్నాడు ఢిల్లీకి చెందిన ఓ సామాన్యుడు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) లో కండక్టర్ గా విధులు నిర్వహించేవాడు 73 ఏళ్ల రణవీర్ సింగ్ యాదవ్. 1973లో ఓసారి విధులు నిర్వర్తిస్తున్న సందర్భంలో చెకింగ్ కోసం వచ్చిన స్టాఫ్, బస్సులో తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో భాగంగా ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి 10 పైసలకి బదులుగా 15 పైసలు వసూలు చేసినట్టుగా యాదవ్ పై ఆరోపణలు వచ్చాయి. ఆ 5 పైసలను యాదవ్ జేబులో వేసుకోవడానికి ప్రయత్నించాడని అతనిపై అంతర్గత విచారణ చేపట్టింది యాజమాన్యం.

చేయని తప్పుకు తనపై అభియోగం మోపడం పట్ల తీవ్రంగా కలత చెందిన యాదవ్, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కోర్టును ఆశ్రయించాడు. 1976 లో మొదలైన యాదవ్ న్యాయపోరాటానికి 1990లో కార్మికుల న్యాయస్థానంలో ఫుల్ స్టాప్ పడింది. అది కూడా విజయవంతంగా. అయితే యాదవ్ కేసు గెలవడాన్ని జీర్ణించుకోలేని ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ 1991లో అదే కేసును తిరగదోడుతూ హైకోర్టులో యాదవ్ పై మళ్లీ కేసు వేసింది.
దీంతో అప్పటి నుంచి యాదవ్ విచారణకు హాజరవుతూనే ఉన్నారు. కాగా.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నట్టు
ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించిన హైకోర్టు యాదవ్ ను నిర్దోషిగా ప్రకటించింది. యాజమాన్యమే తప్పుడు కేసులు బనాయించిందని తేల్చిన కోర్టు.. నష్టపరిహారంగా యాదవ్ కు 30 వేల రూపాయలను చెల్లించాలని ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది.
అంతేకాదు, యాదవ్ పోరాటాన్ని అభినందించిన కోర్టు 1.28 లక్షల పారితోషికంతో పాటు, 1.37 లక్షల సీపీఎఫ్ ను కూడా తక్షణం యాదవ్ కు చెల్లించాలని ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు ఆదేశాలు జారీ చేసింది. మే 26న కార్కార్డోమా కోర్టులో తుదితీర్పు వెలువడనుంది.












Click it and Unblock the Notifications