బెంగుళూరు అతలాకుతలం.. నీట మునిగిన వందల ఇళ్లు, పెరుగుతున్న మృతుల సంఖ్య
భారీ వర్షాలతో బెంగళూరు నగరం అతలాకుతలమైంది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో.. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజల జీవనం స్తంభించింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ బెంగళూరులో నమోదైన అత్యధిక వర్షపాతమే ఇదేనని పేర్కొంటున్నారు.
ముగ్గురు మృతి..
ఈ వర్షాల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. అలానే 500 పైగా ఇళ్లు నీటమునిగాయి. నగరంలో 20కి పైగా సరస్సులు పొంగి పొర్లే పరిస్థితికి చేరుకున్నాయని.. చాలా ప్రాంతాల్లో వీధులు నదుల్లా మారిపోయాయని వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ బస్సు సర్వీసులు సైతం నిలిచిపోయాయి. అంతే కాకుండా సిల్క్ బోర్డు జంక్షన్, కోరమంగల, బీటీయం లేఅవుట్, హెచ్ఆర్బీఆర్ లేఅవుట్, బొమ్మనహళ్లి, పెల్సన్ గార్డెన్ వంటి ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి.

కార్లు, బైకులు వరద నీటికి కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. నగరంలో ఉన్న అండర్పాస్లు, ఫ్లైఓవర్లు నీటితో నిండిపోయి ట్రాఫిక్కు పూర్తిగా అడ్డంకిగా మారాయి.
కేవలం బెంగళూరు మాత్రమే కాకుండా ఉడిపి, బాగల్ కోట్, బెల్గాం, బీదర్, గడగ్, హావేరీ, తుమకూరు, శివమొగ్గ, చిత్రదుర్గ్ జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీటర్లు, వడేరహళ్లిలో 131.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కర్ణాటక ఐఎండీ వెల్లడించింది.
బెంగళూరులో గత 24 గంటల్లో సగటుగా 105.5 మి.మీ వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం తెలిపింది. మే నెలలో ఇటీవలి కాలంలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వర్షాల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మ్యాన్హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు.
మరోవైపు బెంగళూరు నగరాన్ని జలమయంగా మార్చిన వర్షానికి కారణం ప్రజలే అని కర్ణాటక మంత్రి జి.పరమేశ్వర విమర్శించారు. ప్రజలు కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్లను కాలువల్లో పడేయడం వల్ల డ్రైనేజీలు మూసుకుపోతున్నాయని.. దీనివల్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications