అఖిలేష్ యాదవ్ మౌనంపై అనుమానాలు: విమర్శల రూటు మార్చిన అసదుద్దీన్ ఒవైసీ
లక్నో: ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. ఆదివారం మూడో దశ పోలింగ్ను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తొలివిడతలో ఈ నెల 10వ తేదీన 58 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో 55 సీట్లల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక ఎల్లుండి నిర్వహించే మూడో దశలో 59 నియోజకవర్గాల ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ పరిస్థితుల్లో మిగిలిన చోట్ల ప్రచారం మరింత ఉధృతంగా కొనసాగుతోంది. తొలి రెండు దశల పోలింగ్ ట్రెండ్ను ఆధారంగా చేసుకుని- అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచార తీవ్రతను పెంచుతున్నారు. ప్రత్యర్థులపై ఘాటు విమర్శలను సంధిస్తోన్నారు. ఆరోపణాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్లో మైనారిటీల ఓటు బ్యాంకు కూడా కీలక పాత్ర పోషిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ- హిజబ్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

కర్ణాటకలో ప్రపంపనలను సృష్టిస్తోన్న ఈ హిజబ్ వివాదం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. భారతీయ జనతా పార్టీ గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో- దీనిపై ఇతర ప్రతిపక్షాల వైఖరేమిటని ఒవైసీ ప్రశ్నించారు. హిజబ్పై సమాజ్వాది పార్టీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. కోట్లాదిమంది ముస్లింల మనోభావాలు, ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉన్న ఈ విషయంపై అఖిలేష్ యాదవ్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
భోజ్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించారు. తన పార్టీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిజబ్ వివాదంపై వైఖరేమిటని- తమకు ఓటు వేయాలని అభ్యర్థించడానికి వచ్చిన ప్రతి సమాజ్వాది పార్టీ అభ్యర్థినీ నిలదీయాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హిజబ్, నికబ్ గురించి వారిని ప్రశ్నించాలని సూచించారు. ఇదివరకు ఇదే అంశంపై అఖిలేష్ యాదవ్ వివాదాస్పదంగా స్పందించారని విమర్శించారు.
హిజబ్ వివాదానికి సంబంధించినవేవీ తనకు వినిపించట్లేదని అఖిలేష్ చెప్పాడని గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్లో గాలిపటం (ఏఐఎంఐఎం ఎన్నికల గుర్తు) ఎగిరే శబ్దం మాత్రమే ఇకపై అఖిలేష్ యాదవ్కు వినిపిస్తుందని ఒవైసీ స్పష్టం చేశారు. తాము వేసిన అంచనాలకు మించిన సీట్లను గెలుచుకోబోతోన్నామని, మార్చి 10వ తేదీ నాటి ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇది ప్రస్ఫూటమౌతుందని ఒవైసీ అన్నారు. సమాజ్వాది పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications