నేడే హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: 55 లక్షల మంది ఓటర్లు, 412 మంది అభ్యర్థులు
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రంగం సిద్ధమైంది. శనివారం ఆ రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండటంతో ఇప్పటికే ఎన్నికల సిబ్బంది, పోలీసులు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు.
మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో పూర్తికానుంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 35. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 43, కాంగ్రెస్ 22 స్థానాలు దక్కించుకున్నాయి. రాష్ట్రంలో రెండో సారి వరుసగా అధికారంలోకి రావాలని బీజేపీ తహతహలాడుతోంది.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం మేమే అంటూ ఆమ్ఆద్మీ పార్టీ అదృష్టం పరీక్షించుకుంటోంది.
అయితే, 1982 నుంచి ఒక దఫా బీజేపీ, మరో దఫా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తోన్న హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఈసారి అదే ఆనవాయితీని కొనసాగిస్తారా? లేక అందుకు భిన్నంగా చరిత్రను తిరగరాస్తారా? అనే అంశంపై ఆసక్తిగా మారింది.
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు- 55,07,261 ఓటర్లు ఉండగా, ఇందులో
పురుష ఓటర్లు- 27,80,208, మహిళా ఓటర్లు- 22,27,016 ఉన్నారు. తొలిసారి ఓటువేయబోయే యువ ఓటర్లు- 1,86,681 ఉన్నారు.
మొత్తం పోలింగ్ కేంద్రాలు- 7,881 ఏర్పాటు చేశారు. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.












Click it and Unblock the Notifications