యునానిమస్- ఆ రాష్ట్ర సీఎంగా ఆయనకే ఛాన్స్
తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీ జోసెఫ్ విజయ్ పేరుతో ప్రమాణం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఏఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతో ఇక్కడ ప్రభుత్వం కొలువుదీరింది.
ఇక అస్సాం నూతన ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన గువాహటిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర బీజేపీ/ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.

కొద్దిసేపటి కిందటే బీజేపీ శాసనసభాపక్షం.. హిమంత బిశ్వ శర్మను తమ నాయకుడిగా ఎన్నుకుంది. బీజేఎల్పీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అస్సాంలో బీజేపీ విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. మొత్తం 126 సీట్లలో 82 స్థానాలను గెలుచుకుని భారీ విజయం సాధించింది.
అస్సాంలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. తొలిదఫాలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వానికి శర్వానంద సొనొవాల్ నాయకత్వాన్ని వహించారు. ఆ తర్వాత రెండు దఫాలుగా హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తన పట్టును మరింత బలోపేతం చేసుకున్నట్టయింది ఈ గెలుపుతో. గత ప్రభుత్వంలో ఆరోగ్యం, విద్య వంటి కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన హిమంత ఇప్పుడు రాష్ట్రాన్ని నూతన ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన బాధ్యతను తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications