అయోధ్యపై హిందూ-ముస్లీం నేతల చర్చలు
లక్నో: అయోధ్య రామ మందిరం అంశంపై హిందూ, ముస్లీం నాయకులు చర్చలకు ముందుకు వచ్చారు. ఇరు వర్గాల నేతలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు అంగీకరించారు. అయోధ్య - బాబ్రీ మసీదు అంశానికి శాంతియుత పరిష్కారం కావాలని వారు ఈ సందర్భంగా కోరుకున్నారు.
ఆలిండియా అఖాడా పరిషత్ నూతన అధ్యక్షులు మహంత్ నరేంద్ర గిరి మంగళవారం నాడు బాబ్రీ మసీదు కేసులో వృద్ధ నేత హషీం అన్సారీతో భేటీ అయ్యారు. మహంత్ నరేంద్ర గిరితో పాటు కొందరు మహంతులు, సాధువులు కూడా ఉన్నారు.
వీరి మధ్య చర్చలు దాదాపు అరగంటపాటు జరిగాయి. ఈ సందర్భంగా మహంత్ నరేంద్ర గిరి మాట్లాడుతూ... ఈ వివాదం చర్చల ద్వారా పరిష్కారమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పరిష్కారం దిశగా తప్పనిసరిగా హిందువులకు, ముస్లీంలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు.
సుప్రీం కోర్టు ఈ కేసుపై రోజువారీ విచారణ జరపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అన్సారీ మాట్లాడుతూ.. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమని చెప్పారు. ఇరు మతాల వారు సంతోషించే విధంగా శాంతియుత పరిష్కారం కనుగొనాల్సి ఉందని చెప్పారు.