రూ.లక్ష తీసుకొని దేశం విడిచి వెళ్లండి: జడ్జికి చెక్కు
చెన్నై: వివాదాస్పద మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్కు హిందుత్వ సంస్థ ఒకటి రూ.లక్ష చెక్కును పంపించి దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించింది. ఇటీవల తన బదిలీపై తానే స్వయంగా స్టే విధించుకుని, సుప్రీం కోర్టునే కర్ణన్ ప్రశ్నించారు.
దీనిపై హిందూ సంస్థ ఒకటి అతనికి లక్ష రూపాయల చెక్కును పంపించి, దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించింది. తమిళనాడులో రిజిస్టరయిన హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ తాము కర్ణన్ ను వేరే ఏదైనా దేశానికి వెళ్లాలని కోరినట్టు తెలిపింది.
ఇందుకోసం లక్ష రూపాయల చెక్కును పంపామని హిందూ మక్కల్ కట్చి అధ్యక్షులు అర్జున్ సంపత్ తెలిపారు. ఆయన భారత రాజ్యాంగాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందునే ఇలా చేశామన్నారు. కర్ణన్ తమ చెక్కును క్యాష్ చేసుకుంటే, తాను ఏ దేశానికి వెళుతున్నానన్న విషయం తమకు చెబితే చాలని, ఇంకేమీ అడగబోమన్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. వివక్ష కనిపిస్తోందని, ఇలాగైతే తాను దేశం విడిచి వెళ్తానని వ్యాఖ్యానించారు.