జోరుగా: మోడీ ఏడాది పాలనలో ఉద్యోగాలు 2 శాతం పెరిగాయ్
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ఏడాది పాలనలో ఉద్యోగాల కల్పన రెండు శాతం పెరిగింది. ప్రధానమంత్రి మోడీ డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా పథకాలు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో మోడీ ఏడాది పాలనలో నియామకాల జోరు పెరిగింది.
తొలి ఏడాది పాలనలోనే నియామకాల రేటు 2 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనమని టైమ్స్జాబ్స్ నివేదిక రిక్రూట్ ఎక్స్ తెలిపింది. ఐటీ, టెలికామ్, ఈ కామర్స్, స్టార్టప్ రంగాల్లో నియామకాలు సగటున 3 శాతం పెరిగాయి.
వాహన, తయారీ, ఇంజినీరింగ్ రంగాల్లో ఐటీ నిపుణులకు 7 శాతం పెరిగింది. ఎఫ్ఎమ్సీజీ, బీపీఓ, ఐటీ ఆధారిత పరిశ్రమల్లో ఎనిమిది శాతంగా నమోదైంది. గతేడాది మేలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక తయారీ రంగంలో నియమాకాల సగటు వృద్ధి 1 శాతంగా నమోదైంది.
అంతకుముందు 2013 మే-2014 మే మధ్య నియామకాలు 1 శాతం తగ్గాయి. స్మార్ట్ నగరాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించినందున ఈ రంగంలో ఐటీ నిపుణులకు గిరాకీ మరింత పెరిగే అవకాశం ఉంది. మేక్ ఇన్ ఇండియాతో పోలిస్తే డిజిటల్ ఇండియానే ఎక్కువ మందికి ఉపాధి కల్పించనుంది.