జార్ఖండ్లో చరిత్ర రిపీట్ : ఇప్పటివరకు ఏ సీఎం సాధించని ఫీట్..
Recommended Video
బీజేపీ చేతి నుంచి జార్ఖండ్ కూడా జారిపోవడంతో హిందీ బెల్టులో కమలదళం మొత్తం ఐదు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హవా చూసి.. దేశమంతా కమలమయం కాబోతోందని కలలు గన్నవారికి ఇదో పెద్ద శరాఘాతం. జాతీయ స్థాయి అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకుని జార్ఖండ్లోనూ అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కమలనాథుల వ్యూహం బెడిసికొట్టింది. వెరసి రెండోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోలేక చతికిలపడింది. జార్ఖండ్ ఫలితాల్లో మరో ఆసక్తికర అంశమేంటంటే.. సీఎంగా ఉన్న అభ్యర్థి తదుపరి ఎన్నికల్లో గెలిచిన చరిత్ర అక్కడ లేనే లేదు. తాజాగా రఘుబర్దాస్ ఓటమి ఈ పరంపరను కొనసాగించినట్టయింది.
మొదటి నుంచి అదే చరిత్ర..
2000 సంవత్సరంలో ఝార్ఖండ్ ఏర్పడి నాటి నుంచి అక్కడి రాజకీయ చరిత్రను గమనిస్తే.. సీఎం పదవిలో కొనసాగుతూ ఎన్నికలను ఎదుర్కొన్న నేతలెవరూ తదుపరి ఎన్నికల్లో గెలవలేకపోయారు. అర్జున్ ముండా,బాబులాల్ మరాండి,శిబు సోరెన్,మధు కోడా,హేమంత్ సొరెన్.. వీళ్లంతా ముఖ్యమంత్రులుగా ఉండి కూడా వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలవలేకపోయినవారే.
అప్పట్లో శిబు సోరెన్
ఝార్ఖండ్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఆరుగురు ముఖ్యమంత్రులు మారారు. అయితే వీళ్లెవరూ వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలవలేకపోయారు. అగస్టు 27 2008లో మధు కోడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఝార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ శిబు సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అప్పటికీ ఎమ్మెల్యే పదవిలో లేని సోరెన్.. ఆ తర్వాత ఎన్నికలను ఎదుర్కొన్నారు. కానీ ఫలితం ఆయనకు ప్రతికూలంగానే వచ్చింది. తమార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 8973 ఓట్ల తేడాతో ఝార్ఖండ్ పార్టీ రాజా పీటర్ చేతిలో ఓటమిపాలయ్యారు.
మొదటి సీఎం బాబులాల్ మరాండీ కూడా..
ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి ముఖ్యమంత్రి అయిన బాబులాల్ మరాండీ కూడా వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలవలేకపోయారు. 2014 ఎన్నికల్లో ధన్వర్,గిరిదిహ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన రెండు చోట్లా ఓడిపోయారు. గిరిదిహ్లో బీజేపీ అభ్యర్థి నిర్భయ్ షహబాదీ చేతిలో 31వేల ఓట్లతో,ధన్వర్లో రాజ్కుమార్ యాదవ్ చేతిలో ఓటమిపాలయ్యారు.
చరిత్ర రిపీట్
తాజా ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మరోసారి చరిత్రను రిపీట్ చేశాయని చెప్పాలి. ఝార్ఖండ్ ముఖ్యమంత్రులెవరూ వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలవలేరన్న సెంటిమెంట్ మరోసారి రుజువైంది. ఏదేమైనా ఝార్ఖండ్ ఫలితాలతో హిందీ బెల్టులో ప్రాభవాన్ని కోల్పోతున్న సంకేతాలు ఇప్పుడు బీజేపీని కలవరపెడుతున్నాయి. గెలుపోటములపై అర్జెంటుగా పోస్టుమార్టమ్ మొదలుపెట్టి పార్టీ గ్రాఫ్ పడిపోకుండా చూడాలని ఆ పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తోంది.