హోలీ నజరానా: ఎయిర్ లైన్స్ సంస్థల ‘కలర్ ఫుల్’ఆఫర్లు
పండగలు, ప్రత్యేక రోజుల్లో పలు రాయితీలను అందిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి విమానయాన సంస్థలు. తాజాగా హోలీ పండుగను పురస్కరించుకుని కలర్ ఫుల్ ఆఫర్లు ప్రకటించాయి.
ఢిల్లీ: పండగలు, ప్రత్యేక రోజుల్లో పలు రాయితీలను అందిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి విమానయాన సంస్థలు. తాజాగా హోలీ పండుగను పురస్కరించుకుని కలర్ ఫుల్ ఆఫర్లు ప్రకటించాయి.
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాతో పాటు ఎయిర్ ఏషియా, ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ లాంటి ప్రైవేటు ఎయిర్ లైన్స్ కూడా ప్రయాణికుల కోసం భారీ డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లను అందిస్తున్నాయి.
విమాన టికెట్ పై ప్రాథమిక రుసుము(బేస్ ఫేర్)లో డిస్కౌంట్ ప్రకటించింది ఎయిరిండియా. ఎకానమీ క్లాసులో 10 శాతం, బిజినెస్ క్లాసులో 20 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే జెట్ ఎయిర్ వేస్ కూడా రూ.1330 ప్రారంభ ధరతో దేశీయ విమానాల్లో ప్రత్యేక ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రయాణానికి 20 రోజుల ముందు బుక్ చేసుకునే వారికి ఈ సదుపాయం వర్తిస్తుందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. మరో ఎయిర్ లైన్స్ ఎయిర్ ఏషియా కూడా హోలీ ఆఫర్ ను ప్రకటించింది. రూ.1499 ప్రారంభ ధరతో ప్రమోషనల్ ఆఫర్ ను తీసుకొచ్చింది.
ఈ డిస్కౌంట్ ఆఫర్ల పుణ్యమాని.. ఎయిర్ ట్రావెల్ మార్కెట్ బాగా పెరిగిందని పౌరవిమానయాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్క జనవరిలోనే దేశీయ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య 25 శాతానికి పైగా పెరిగిందట. జనవరిలో 95.79 లక్షల మంది విమాన ప్రయాణం చేసినట్లు డీజీసీఏ డేటా పేర్కొంటోంది.