కర్ణాటకలో ప్రజాస్వామ్యం హత్య: నిప్పులు చెరిగిన రాహుల్
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో బిఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా ప్రజాస్వామ్యం హత్య చేయబడిందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. గురువారం నాడు ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ తన విమర్శలను ఎక్కుపెట్టారు.
కర్ణాటకలో ప్రజాస్వామ్యం హత్య చేయబడడంతో దేశమంతా చింతిస్తోందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కానీ, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందకు బిజెపి సంబరాల్లో మునిగిపోయిందన్నారు.
సంఖ్యా బలం లేకపోయినా బీజేపీ దొడ్డిదారిన అధికారానికి వచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆయన అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించిందని రాహుల్ విమర్శలు గుప్పించారు.
మే 12వ తేదిన జరిగిన ఎన్నికల్లో బిజెపి 104 ఎమ్మెల్యేలను గెలుచుకొంది. కాంగ్రెస్ కు 78, జెడి(ఎస్)కు 38 స్థానాలు దక్కాయి. దీంతో కాంగ్రెస్,. జెడి(ఎస్)లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించాయి.
అంతేకాదు ఈ తరుణంలో బిజెపిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. బిఎస్ యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.