పరిశోధనలో షాకింగ్: ఆవు మూత్రంలో బంగారం!
జునాగఢ్: హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే ఆవులో ఎన్నో ప్రత్యేకతలున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విశేషం వెలుగులోకి వచ్చింది. గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఎక్కువగా కనిపించే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జునాగఢ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(జేఏయూ) బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ అధిపతి డా. బీఏ గోలకియా నేతృత్వంలోని బృందం ఈ పరిశోధనలు జరిగాయి.
దాదాపు 400 గిర్ జాతి ఆవుల మూత్రంపై నాలుగేళ్లపాటు విస్తృతంగా పరిశోధనలు జరిపిన ఈ బృందం.. ఆవు లీటర్ మూత్రంలో మూడు మిల్లీ గ్రాముల నుంచి 10 మిల్లీ గ్రాముల వరకు బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారానికి సంబంధించిన ధాతువులు నీటిలో కలిసిపోయి ఆవుల మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతున్నట్లు పరిశీధనలో తేలిందని తెలిపారు.
పూర్వీకుల చిత్రాల్లో మాత్రమే ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు తెలిసేదని.. పరిశోధనలు చేయగా అది నిజమేనని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని రకాల రసాయన పద్ధతులను ఉపయోగించి ఆవుల మూత్రం నుంచి బంగారాన్ని వేరుచేయవచ్చని తెలిపారు. ఒంటే, గేదే, గొర్రె, మేకలపై కూడా ఇలాంటి పరిశోధనలు చేశామని, అయితే వాటి మూత్రంలో వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన ఆధారాలేవీ కనిపించలేదని వివరించారు.
కాగా, గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో అనేక రకాల వ్యాధులకు నిరోధకంగా పని చేసే లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. ఈ పరిశోధనలు చేసే జేఏయూ ఫుడ్ టెస్టింగ్ ల్యాబోరేటరీ దాదాపు యేటా 50వేలకు పైగా పరీక్షలు జరుపుతోంది. ఎగుమతులు, డైరీ ప్రొడక్ట్స్, కూరగాయలు, పప్పు దినుసులు, తేనే, పురుగు మందులు, తదితర అంశాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గిర్ ఆవుల మూత్రం మనుషుల జబ్బులకు, వృక్షాల పెంపకానికి ఎలా పని చేస్తుందనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు జేఏయూ శాస్త్రవేత్తలు.