భయానకం, పశువుల కంటే హీనంగానా?: ఢిల్లీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ : కరోనా కట్టడి చర్యలపై ఢిల్లీ ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కరోనా నేపథ్యంలో దేశ రాజధానితోపాటు పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఢిల్లీ ఆస్పత్రుల్లో కరోనా రోగులను పశువుల కంటే హీనం చూస్తున్నారని, ఆస్పత్రుల్లో నిర్వహణ సరిగా లేదని మండిపడింది.

చెత్త కుప్పలో మృతదేహాలా?
చెత్త కుప్పలో మృతదేహాలు కనబడటం వంటి దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ కౌల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాలను ఉంచడంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరీక్షల శాతం ఎందుకు తగ్గిందని సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్ సర్కారును ప్రశ్నించింది. తొలుత కరోనా పరీక్షల నిర్వహణలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్రమంగా ఎందుకు పడిపోయిందని నిలదీసింది. గతంలో రోజుకు 7వేల పరీక్షలు చేస్తే.. ఇప్పుడు కేవలం 5వేల పరీక్షలే చేస్తున్నారని వ్యాఖ్యానించింది.

కరోనా రోగులకు పడకలు లేక..
చెన్నై, ముంబై నగరాల్లో 16వేలు నుంచి 17వేలకు పరీక్షల సంఖ్య పెరిగిందని సుప్రీంకోర్టు పేర్కొంది. కరోనా రోగులు ఆస్పత్రుల్లో పడకలు లేక ఇబ్బందులు పడుతున్నారని మీడియాలో కథనాలు వస్తుంటే.. ప్రభుత్వాలు మాత్రం పడకలు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. కేంద్రంతోపాటు ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.
Recommended Video

దేశంలో 3 లక్షల దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్రలో లక్ష కేసులు
కాగా, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,687కు చేరగా, 1085 మంది కరోనాతో మరణించారు. 20,871 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో లక్ష కేసులు దాటాయి. 1,01,141 కరోనా పాజిటివ్ కేసులుండగా, 3717 మరణాలు సంభవించాయి. ఇక దేశ వ్యాప్తంగా 3,05,613 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8711 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications