వాయిదా సమయంలో పన్నీర్ వేసిన ఎత్తు!.. డీఎంకె విధ్వంసం వెనుక వ్యూహమిది!
స్పీకర్ సభను అరగంట వాయిదా వేయడంతో.. దొరికిన ఆ అరగంట సమయంలో పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకోవడానికి పన్నీర్ వర్గం ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది.
చెన్నై: విధ్వంసం.. గందరగోళం.. స్పీకర్ పై దాడికి ప్రయత్నించడం.. నేటి ఉదయం సమావేశమైన తమిళనాడు అసెంబ్లీలో కనిపిస్తోన్న దృశ్యాలివి. సభను ముందుకు సాగనివ్వకుండా డీఎంకె నేతలు అడుగడుగునా స్పీకర్ కు అడ్డుపడుతున్నారు.
సభలో డీఎంకె నేతల ప్రవర్తన శృతిమించడంతో స్పీకర్ అరగంటపాటు అసెంబ్లీని వాయిదా వేశారు. అయినా సరే నేరుగా ఆయన వద్దకే వచ్చిన డీఎంకె నేతలు స్పీకర్ తో వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేశారు. ఇంతలో మార్షల్స్ ఆయన్ను సభ నుంచి బయటకు తరలించారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగానే డీఎంకె తమ ఎమ్మెల్యేల చేత విధ్వంసాన్ని చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ముందునుంచి పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటిస్తున్న డీఎంకె.. సభను గనుక ఈరోజుకు వాయిదా వేయగలిగితే.. ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకోవాలన్న ఆలోచన ఒకటైతే.. ఒకవేళ అది సాధ్యపడని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించే పరిణామాలను సృష్టించాలన్న ప్లాన్ లో భాగంగానే డీఎంకె ఇలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇందుకోసం సీక్రెట్ ఓటింగ్ ను తెరపైకి తీసుకొచ్చి సభకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్పీకర్ మాత్రం సీక్రెట్ ఓటింగ్ రాజ్యాంగ నిబంధనలకు విరుద్దమంటూ చెబుతున్నారు. డీఎంకె మాత్రం పట్టువదలకుండా ఇందుకోసం ప్రయత్నిస్తూనే ఉండటంతో పరిణామాలు ఎటు తిరిగి ఎటు వస్తాయోనన్న ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉంటే, స్పీకర్ సభను అరగంట వాయిదా వేయడంతో.. దొరికిన ఆ అరగంట సమయంలో పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకోవడానికి పన్నీర్ వర్గం ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం పళనిస్వామి ఇలాంటి పరిణామాలను ముందే ఊహించి ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తపడ్డారు.
నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్కో మంత్రి చొప్పున పళనిస్వామి మంత్రులను ఎమ్మెల్యేల కాపలాగా నియమించారు. పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలను కలవకుండా మంత్రులు వారిని కట్టడి చేస్తున్నారు.