'బోల్నా ఆంటీ': యూట్యూబ్లో మహిళలపై దారుణ వీడియో, తొలగించమన్నందుకు బెదిరింపులు
న్యూఢిల్లీ: యూట్యూబ్లో మహిళలను కించపరిచేలా ఉన్న ఓ అసభ్య వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు గాను జర్నలిస్టు దీక్ష శర్మ బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. బెంగుళూరులో హత్యకు గురైన గౌరీ లంకేశ్ గతే నీకు పడుతుందంటూ ఆమెను హెచ్చరిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఓం ప్రకాశ్ మిశ్రా అనే యూట్యూబ్ సింగర్ 'బోల్నా ఆంటీ ఆవూ క్యా' పేరిట ఓ అసభ్య వీడియో సాంగ్ పోస్టు చేశాడు. పాటంతా డబుల్ మీనింగ్ లతో.. అసభ్య పదజాలంతో సాగుతుంది. మహిళలను కించపరిచేలా ఉన్న ఈ వీడియో యూట్యూబ్లో వైరల్గా మారింది.
ఈ వీడియో చూసిన దీక్ష శర్మ.. దీన్ని తొలగించాల్సిందిగా యూట్యూబ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. అధికారులు దాన్ని తొలగించేశారు. ఈ వీడియోను తప్పుబడుతూ క్వింట్ అనే వెబ్ పోర్టల్ లో దీక్ష ఒక కథనాన్ని కూడా రాసింది. దీంతో ఆమెకు బెదిరింపులు రావడం మొదలైంది. రేప్ చేసి చంపేస్తామని, గౌరీ లంకేష్ కు పట్టిన గతే పడుతుందని ఆమెను భయపెడుతున్నారు.
కాగా, యూట్యూబ్ ఆ వీడియోను తొలగించినప్పటికీ.. కొంతమంది నెటిజెన్స్ దాన్ని తిరిగి అప్ లోడ్ చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు! దానిపై కథనాన్ని వెలువరించిన క్వింట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.