వినియోగదారుడికి మంచి వార్తలు అందించడమే డెయిలీహంట్ ముఖ్య ఉద్దేశం: ఉమాంగ్ బేడీ
భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో విపరీతంగా పెరిగిపోయిందన్నారు డెయిలీ హంట్ న్యూస్ యాప్ ప్రెసిడెంట్ ఉమాంగ్ బేడీ. ముఖ్యంగా దేశ ప్రజలు వార్తలను ఫాలో అవుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగిందన్నారు. వార్తల పట్ల వినియోగదారుడికి ఉన్న ఆసక్తే నేడు వ్యాపార వ్యూహాలకు ఆయుధంగా మారిందని తద్వారా టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం జరుగుతోందని ఉమాంగ్ బేడీ చెప్పారు.
సీఎన్బీసీ టీవీ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమాంగ్ బేడీ పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రాంతీయ భాషల్లో వార్తలు అందించడమే డెయిలీహంట్ యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పిన ఆయన... అది టెక్నాలజీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. డెయిలీ హంట్ ఇతర వెబ్సైట్ల నుంచి వార్తలు లేదా లింకులు సేకరించి యాప్లో పొందుపరుస్తుందని చెప్పడం కన్నా భారత్లో జరుగుతున్న అన్ని విషయాలను ఒకే యాప్ ద్వారా డెయిలీ హంట్ అందిస్తోందని చెప్పడం మిన్న అని అన్నారు. వివిధ వెబ్సైట్లు లేదా వార్తా సంస్థలు ప్రచురించే వార్తలకు సంబంధించి లింకులు పెడుతామన చెప్పడం సబబు కాదన్న ఆయన ఆ స్టేజ్ను ఎప్పుడో దాటిపోయామని స్పష్టం చేశారు. ఇక వార్తలకు సంబంధించి ఎక్కడి నుంచి సమాచారం వస్తుందనేది చాలామందిలో క్లారిటీ రావాల్సి ఉందన్న ఆయన.... డెయిలీ హంట్ సంస్థ దేశంలో పేరున్న 1500 వార్తా సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, 15000 మంది ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్స్ ఇందులో భాగస్వాములయ్యారని స్పష్టం చేశారు. వినియోగదారుడి వ్యక్తిగత భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా డెయిలీ హంట్ యాప్లో కంటెంట్ను పొందుపరుస్తున్నామన్నారు.
"డెయిలీహంట్ యాప్లో వస్తున్న కంటెంట్ ఒక వ్యక్తి సొంతంగా పొందుపర్చేది కాదు.. దీని వెనక పెద్ద వ్యవస్థే పనిచేస్తుంది.ఇక వార్తల విషయానికొస్తే దేశవ్యాప్తంగా 10వేల మంది స్ట్రింగర్లు పనిచేస్తున్నారని వారంతా వార్తలు సేకరించి పంపుతారు. భారతదేశంలో 14 నుంచి 15 ప్రాంతీయ భాషల్లో వార్తలు అందిస్తున్నాం. ఇక మా సొంత కంటెంట్ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం.ఇందుకోసం స్టూడియోలను ఏర్పాటు చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇక స్టూడియోల నుంచే వార్తలు ప్రసారం చేస్తాం" అని ఉమాంగ్ బేడీ అన్నారు. ఇక సొంత క్రియేటివిటీతో వార్తలను అందించే క్రమంలో తాము వన్ఇండియా అనే పబ్లిషర్ను టేకోవర్ చేసినట్లు చెప్పారు. ఇక ఆ సంస్థకు సంబంధించిన ప్రొఫెషనల్ జర్నలిస్టులు కంటెంట్ను అందిస్తారని చెప్పారు.
డెయిలీ హంట్ టెక్నాలజీని ఎలా వినియోగిస్తుంది...?
డెయిలీ హంట్ టెక్నాలజీ వేదికగా పనిచేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక ఆల్గారిథంను రూపొందించామని చెప్పిన ఉమాంగ్ బేడీ.. తమ భాగస్వాముల దగ్గరనుంచి కంటెంట్ను తీసుకుని టెక్నాలజీ సహాయంతో వార్తలను పొందుపరుస్తామని దీంతో వినియోగదారుడు ఎప్పుడూ యాప్పై ఉంటారని చెప్పారు. 15 భాషల్లో తమకు కంటెంట్ అందినప్పుడు ముందుగా దాన్ని పరిశీలిస్తామని చెప్పారు ఉమాంగ్ బేడీ. ముందుగా హెడ్లైన్స్ను పరిశీలిస్తామని ఆ తర్వాత కంటెంట్ను క్షుణ్ణంగా చదువుతామని.. కంటెంట్కు సంబంధించిన ఫోటోలు వీడియోలను పరిశీలించి, ఆ తర్వాత ఆ వార్త ఏ కేటగిరీకి చెందుతుందో నిర్ణయిస్తామని ఉమాంగ్ చెప్పారు. ఇదంతా ఓకే అనుకున్న తర్వాత ఈ వార్తను 25వేల ఇంట్రెస్ట్ గ్రూపులతో ట్యాగ్ చేస్తామని వివరించారు. ఇక రియల్ టైమ్లో తమ వార్తలపై యూజర్ ఎంతసేపు ఉన్నాడో కంటెంట్ గ్రాఫ్ పై తమకు తెలుస్తుందని చెప్పారు.అంతేకాదు ఉన్న కంటెంట్లో యూజర్ ఏ వార్తపై క్లిక్ చేస్తున్నాడో కూడా తెలుస్తుందన్నారు. ఆ ఆర్టికల్పై ఎంత సమయం వెచ్చించాడు, ఆర్టికల్ నచ్చిందా లేదా, ఆర్టికల్ను షేర్ చేశాడా లేదా... ఏమైనా కామెంట్ రాశాడా అనేదాన్ని పర్యవేక్షిస్తామని ఉమాంగ్ చెప్పారు. ఇక దీన్ని బట్టే యూజర్ ఎలాంటి వార్తలు కావాలనుకుంటున్నాడో తెలుసుకుని ఆ తరహా వార్తలను పొందుపర్చేందుకు ప్రయత్నిస్తామని ఉమాంగ్ వివరించారు.
ఫేస్ బుక్ మోడల్కు డైలీ హంట్ యాప్కు తేడా ఏమిటి..?
"ఫేస్బుక్ కానీ, లేదా ఇతరత్ర సోషల్ మీడియా సైట్కానీ ముందుగా సైన్ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మన వ్యక్తిగత వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి మన సమాచారం ఆ సంస్థలకు తెలుస్తుంది. కానీ డెయిలీ హంట్ అలా కాదన్నారు. ఎవరైనా సరే తమ వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండానే డెయిలీ హంట్ యాప్లోకి ప్రవేశించొచ్చు. ఇందుకోసం ఎలాంటి సైన్ ఇన్ అక్కర్లేదు" అని ఉమాంగ్ బేడీ చెప్పారు. సాధారణ వార్తలకు కాకుండా ఇతర అంశాల గురించి తెలుసుకోవాలంటే సైన్ఇన్ అవ్వాల్సిందే అని వెల్లడించారు. "ఉదాహరణకు జీఎస్టీ, లేదా డీమోనెటైజేషన్ లేదా 2019 ఎన్నికలు గురించి ఓ యూజర్ తెలుసుకోవాలని అనుకుంటున్నాడని అనుకుందాం. అయితే ఈ వార్తలను మా పబ్లిషర్ల దగ్గర నుంచి తీసుకుంటాం. ఒక్కో పబ్లిషర్ ఒక్కోలా వార్తను ప్రెజెంట్ చేస్తారు. ఇందులో ప్రభుత్వానికి మద్దతుగా ఒకరు వార్త ఇస్తే మరొకరు వ్యతిరేకంగా అదే అంశంపై వార్త రాస్తారు. కానీ డెయిలీ హంట్ తటస్థంగా వ్యవహరిస్తుంది. వార్తను వార్తలానే పొందుపరుస్తుంది. ఇందుకోసం అనుకూల కోణం, వ్యతిరేక కోణం రెండు క్షుణ్ణంగా పరిశీలించి వార్తను చదివే యూజర్ సంతృప్తి చెందేలా వార్తను అందిస్తాము" అని ఉమాంగ్ చెప్పారు.
భవిష్యత్తు ప్రణాళిక...
త్వరలో యాప్లోనే టీవీ ఛానెల్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఉమాంగ్ తెలిపారు. ఇప్పటికే 30 నుంచి 40 వరకు ఛానెళ్లు ఉన్నాయని అవి త్వరలోనే 543 ఛానెళ్లకు చేరుకుంటాయని చెప్పారు. అంటే దేశంలో 543 పార్లమెంటరీ స్థానాలున్నాయని ఒక్కో పార్లమెంటరీ స్థానానికి ఒక్కో ఛానెల్ యాప్లో పొందుపరచి ఉంటుందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఎలాంటి ఎడిటోరియల్స్ ఉండవని తమకు స్ట్రింగర్ ఇచ్చిన సమాచారం ఇతర పెద్ద పబ్లికేషన్స్ నుంచి వచ్చిన సమాచారం రెండు కలిపి ఒక వార్తగా అందిస్తామని చెప్పారు. తమ టీవీని ప్రమోట్ చేసుకునేందుకు ఈ మంత్రాన్నే ఉపయోగిస్తామని చెప్పారు.
తప్పుడు వార్తలపై చర్యలు తీసుకుంటాం
"తప్పుడు వార్తలు, పుకార్లు భారీ నష్టాన్ని తీసుకొస్తున్నాయి. అవి శాపంగా మారాయి. అసలు తప్పుడు వార్తలు ఎక్కడ ప్రారంభమవుతాయి..? ఇది కేవలం పుకార్ల నుంచే పుడుతాయి. లేదా ఎవరో ఒక యూజర్ నుంచి వస్తాయి. కానీ డెయిలీ హంట్లో యూజర్ కంటెంట్ను పొందుపర్చము" అని ఉమాంగ్ క్లారిటీ ఇచ్చారు. స్ట్రింగర్ల దగ్గర నుంచి వచ్చే సమాచారం ముందుగా ఎడిటోరియల్ దగ్గరకు వెళుతుంది. అక్కడ సమీక్ష జరుగుతుంది. డెయిలీ హంట్లో 450 మంది, వన్ ఇండియాలో 400 మంది ఎడిటోరియల్ టీమ్కోసం పనిచేస్తున్నారు.వీరంతా కంటెంట్ను ఎడిటోరియల్ను పర్యవేక్షిస్తారు. కంటెంట్ ఎక్కడ నుంచి వచ్చింది... ఇది నిజమైన వార్తగానే చూడొచ్చా... వచ్చే సోర్స్ను ఎంతవరకు విశ్వసించొచ్చు అనే అంశాలపై బేరీజు వేసుకుని ఆ తర్వాతే యాప్లో పొందుపరుస్తామని ఉమాంగ్ చెప్పారు. కొన్ని సందర్భాల్లో పేరున్న పబ్లిషర్ ఇచ్చే వార్తల్లో కూడా నిజం ఉండకపోవచ్చనే విషయాన్ని ఉమాంగ్ గుర్తుచేశారు. అలాంటి సందర్భాల్లో తాము మూడు పనులు చేస్తామని వివరించారు. తమకు పబ్లిషర్ క్వాలిటీ స్కోరు, కంటెంట్ క్వాలిటీ స్కోరు, యూజర్ ఇచ్చే కామెంట్స్ను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఒకవేళ ఫలానా ఆర్టికల్ గురించి రెండు వేర్వేరు యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతే... ఆ వార్తలోని నిజనిజాలను తమ టీమ్ వర్కౌట్ చేస్తుందని ఉమాంగ్ తెలిపారు. అంతేకాదు పబ్లిషర్ నుంచి ఆ వార్త వచ్చింది కాబట్టి ఆ పబ్లిషర్ను సంప్రదించి క్లారిటీ తీసుకుంటామని చెప్పారు. ఇక రాజకీయపరమైన వార్తలు కానీ రాజకీయంతో ముడిపడిన వార్తలను కానీ చిన్న పబ్లిషర్ల నుంచి తీసుకోమని పెద్ద పబ్లిషర్లపైనే ఆధారపడుతామని ఉమాంగ్ చెప్పారు. అయితే తమ సంస్థలో పనిచేసే స్ట్రింగర్ ఫలానా వార్తను నిర్ధారిస్తే తప్ప దాన్ని యాప్లో పొందుపర్చబోమని చెప్పారు. అందుకే రాజకీయ వార్తలను రిప్యూటేషన్ ఉన్న సంస్థల నుంచే సేకరించి యాప్లో పొందుపరుస్తామని చెప్పారు ఉమాంగ్ బేడీ.