మరో భారీ బ్యాంకింగ్ స్కామ్; రూ.4037 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన కంపెనీ; సీబీఐ కేసు!!
భారతదేశంలో వైట్ కాలర్ నేరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో బ్యాంకులను మోసం చేస్తున్న ఘరానా కేటుగాళ్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా బ్యాంకులను మోసం చేసి రుణాలను తీసుకుని ఆ నిధులను, డమ్మీ ఖాతాలకు మళ్లించి, బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడుతున్న ఓ కంపెనీ గుట్టు రట్టు చేశారు సిబిఐ అధికారులు.
ఇప్పటికే దేశాన్ని దోచుకుని, బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ వంటి వారి విషయంలోనే ఇంకా వారి నుండి సొమ్ము వసూలు చెయ్యటానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తుంది. ఇక తాజాగా మరో ఘరానా మోసం బయటపడింది.
మరో భారీ బ్యాంకింగ్ స్కాం .. 4037 కోట్ల రూపాయల మోసం
భారత దేశంలో తాజాగా మరొక భారీ బ్యాంక్ స్కాం వెలుగు చూసింది. 4037 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ కంపెనీ పై సీబీఐ కేసు నమోదు చేసింది. కలకత్తాకు చెందిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీ పై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఈ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే ఎగ్గొట్టారు అన్న ఆరోపణలపై సిబిఐ కేసులు నమోదు చేసింది.
కంపెనీ యజమాని మనోజ్ జైశ్వాల్ సహా 13 మందిపై కేసులు
కంపెనీ యజమాని మనోజ్ జైశ్వాల్ తో పాటుగా 13 మందిపై కేసులు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు లో భాగంగా విశాఖపట్నం, నాగపూర్, ముంబై, కలకత్తా, దుర్గాపూర్, రాంచీ, ఘజియాబాద్ లలోని 16 కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీకి చెందిన స్థావరాల పై దాడులు చేసిన సిబిఐ అధికారులు గురువారం నాడు సోదాలు నిర్వహించారు. మొత్తంగా చూస్తే కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీ రూ.4037.87 కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. 20 బ్యాంకుల కన్సార్టియం ఫిర్యాదుతో కేసు నమోదు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఇరవై బ్యాంకుల కన్సార్టియం ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 30వ తేదీ 2013న ఆరోపించిన కంపెనీ ఖాతాను ఎన్ పీ ఏ గా ప్రకటించింది. ఆపై ఖాతాలు 2019 అక్టోబర్ లో మోసపూరితంగా ప్రకటించబడ్డాయి.
2009 నుండి 2013 వరకు నిందితులు తారుమారు చేసిన ప్రాజెక్టు కాస్ట్ స్టేట్మెంట్లు, చెల్లించని బ్యాంక్ నిధులు, ట్రేడ్ రిసీవబుల్స్ మరియు సంబంధిత పార్టీలకు లావాదేవీలు సమర్పించారని, నిధులు డమ్మీ ఖాతాలకు మళ్ళించబడ్డాయని సిబిఐ అధికారులు ఈ కేసులో గుర్తించారు. అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కంపెనీ మరియు దాని ప్రమోటర్లు దాని డైరెక్టర్ల పేర్లను ఏజెన్సీ పేర్కొంది.