చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం: రంగంలోకి 30 ఫైరింజిన్లు, 500 మంది సిబ్బంది గంటలపాటు శ్రమించారు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగర శివారు మాధవరంలోని ఓ ప్రైవేటు గోదాంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రౌండ్ రానాలోని ఓ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించాయి. భయంతో స్థానికులు నివాసాల నుంచి పరుగులు తీశారు.
ప్రమాదం గురించి సమాచారం అందడంతో పలు ప్రాంతాల నుంచి 30 అగ్ని మాపక వాహనాలు, దాదాపు 500 మంది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటలపాటు శ్రమించిన మంటలు అదుపులోకి రాలేదు. దీంతో 20 మెట్రో వాటర్ ట్యాంకర్లను కూడా తెప్పించారు. సమీపంలోని నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని పోలీసులు, అధికారులు హెచ్చరించారు.
మాధవరం మాపుల్ బస్ టెర్మినల్కు సమీపంలోనే ఉండటంతో బస్సులను కూడా దూరంగా ఆపివేశారు. రోడ్డు వెంట ఉన్న వాహనాలను కూడా ఘటనా స్థలానికి దూరంగా తరలించారు.
పొగ విపరీతంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. కళ్లమంటలతో పలువురు ప్రజలు బాధపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాముల్లో రసాయనాలు, ఆయిల్ బ్యారెళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం ఏర్పడగా రాత్రి 7 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే, ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికీ.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications