సభలో నరేంద్ర మోడీ-రాహుల్ గాంధీ ఆలింగనం, ముంబైలో పోస్టర్లు
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం లోకసభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని హగ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది వైరల్ అయింది. అయితే, ప్రధానిని హగ్ చేసుకొని తాము ప్రేమతో జయిస్తామని చెప్పే ప్రయత్నం చేసిన రాహుల్.. ఆ తర్వాత తప్పులో కాలేశారు.
తనది అసలైన ప్రేమ కాదని ఆ తర్వాత నిరూపించారు. ప్రధానిని హగ్ చేసుకున్న తర్వాత ఆయన తన సీట్లోకి వెళ్లారు. తన ఎంపీలు ఏదో అడగ్గా.. కన్నుగీటుతూ కెమెరాలకు చిక్కారు. తద్వారా అదంతా ఉత్తిదే అన్న అభిప్రాయం అందులో కనిపించింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రధానిని రాహుల్ హగ్ చేసుకోవడంపై ముంబైలో పోస్టర్లు వెలిశాయి.
కాంగ్రెస్ పార్టీ ఈ పోస్టర్లు వేసింది. 'ప్రేమతో గెలుస్తాం, ద్వేషంతో కాదు' అని ఆ పోస్టర్లపై పేర్కొంది. ముంబై కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఎంపీ నిరుపమ్ వీటిని ఏర్పాటు చేశారు. దాని మీద రాహుల్ గాంధీ, మోడీ ఆలింగనం చేసుకున్న ఫొటోతో పాటు హిందీలో ఈ సూక్తిని రాశారు.
ఇదిలా ఉండగా శివసేన అవిశ్వాస తీర్మానాన్ని ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్తో పోల్చింది. నరేంద్ర మోడీ ఫ్రాన్స్లా గెలిచాడని పేర్కొంది. రాహుల్ గాంధీని క్రొయేషియాతో పోల్చింది. గ్రూప్ దశను దాటడమే గగనమనుకున్న క్రొయేషియా ఫైనల్కు చేరి అందరిని ఆకట్టుకుంది. అలాగే రాహుల్ కూడా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని శివసేన వ్యాఖ్యానించింది.