మెహబూబా ముఫ్తీకి షాక్: పీడీపీని వీడిన ముగ్గురు నేతలు, ఆ కామెంట్సే కారణం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త్రివర్ణ పతాకంపై ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు దేశభక్తి మనోభావాలు దెబ్బతీశాయని సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అంతేగాక, ముఫ్తీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ముగ్గురు సీనియర్ నేతలు పార్టీని వీడారు.
పీడీపీ నేతలు టీఎస్ బజ్వా, వేద్ మహాజన్, హుస్సేన్ ఏ వఫాలు తమ రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి పంపారు. ముఫ్తీ వ్యాఖ్యలు క్షమించరానివని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
గత సంవత్సరం ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ సహా పలువురు రాజకీయ నేతలను ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. 14 నెలల అనంతరం ఆమె నిర్బంధం నుంచి ఇటీవలే విడుదలయ్యారు. అయితే, మెహబూబా ముఫ్తీ విడుదలైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే.. త్రివర్ణ పతకాన్ని ఎగురవేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నాయకులను విమర్శించిన ఆమె.. జమ్మూకాశ్మీర్లో ప్రత్యేక జెండాను తిరిగి పునరుద్ధించాలని డిమాండ్ చేశారు. కాగా, ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ సహా పలు పార్టీలు తీవ్రంగా స్పందించారు. ముఫ్తీపై దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని జమ్మూకాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హాను బీజేపీ నాయకులు కోరారు.
ముఫ్తీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, త్రివర్ణ పతాకం భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ పతాకాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ ముఫ్తీకి హితవు పలికింది. కాగా, సోమవారం బీజేపీ నేతలు పీడీపీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగురవేశారు.