ఘోరం: పెళ్లైన నాల్గు రోజులకే భార్యను ముక్కలుగా నరికేశాడు, ముందే ప్లాన్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివామైన నాలుగు రోజులకే ఓ నవ వధువును దారుణంగా హత్య చేశాడు ఆమెను కట్టుకున్న భర్త. అంతేగాక, ఆమె తలను మొండెం నుంచి వేరు చేసి ఆ తలను షాపూర్-నాసిక్ రోడ్డు సమీపంలోని అడవుల్లో పడేశాడు. ఆమె హత్యకు వరుడి తల్లిదండ్రులు కూడా సహకరించడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. ప్రియాంక గౌరవ్(23), సిద్ధేష్(25)లకు నాలుగు రోజుల క్రితమే వివాహమైంది. కారణమెంటో తెలియదు గానీ, పెళ్లైన నాలుగు రోజులకే(ఏప్రిల్ 4) ప్రియాంకను దారుణంగా హత్య చేశాడు సిద్ధేశ్. దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత ఆమెను ముక్కలు ముక్కలుగా నరికాడు.
సిద్ధేశ్ తల్లిదండ్రులు మనోహర్(50), మాధురి(48), మరో స్నేహితుడు దుర్గేశ్ పాత్వా(31)లు ప్రియాంక హత్యకు సహకరించారు. ప్రదీప్ జైన్(34) అనే మరో వ్యక్తి ప్రియాంక శరీరాన్ని ముక్కలుగా చేసేందుకు సిద్ధేశ్కు సహకరించాడు. కాగా, ప్రియాంక తలను సమీపంలోని అడవుల్లో, ఆమె మొండాన్ని సమీపంలోని మురికి కాలువలో పడేశాడు సిద్ధేశ్.
ప్రియాంకను దారుణంగా హత్య చేసిన నిందితుడు సిద్ధేశ్.. తనకేమీ తెలియనట్లుగా ఏప్రిల్ 5న తన భార్య అదృశ్యమైందని వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియాంక తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు.
అడవుల్లో ప్రియాంక తలను కనుగొన్న పోలీసులు, మురికి కాలువ సమీపంలో ఆమె మొండాన్ని(మే 5న) గుర్తించారు. ఆమె కట్టుకున్న బట్టలు, ఆమె శరీరంపై ఉన్న గణపతి టాటూ కారణంగా అది ప్రియాంక మృతదేహమని పోలీసులు గుర్తించారు. ఆమె కాళ్లు కూడా మరికొంత దూరంలో లభించినట్లు పోలీసులు తెలిపారు.
సిద్ధేశ్ తో సహా ప్రియాంక హత్యకు సహకరించిన నిందితులందర్నీ శనివారమే అరెస్ట్ చేశామని చెప్పిన పోలీసులు.. మరో నిందితుడు ప్రదీప్ జైన్ను ఆదివారం అరెస్ట్ చేసినట్లు తెలపారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, పెళ్లికి ముందే పథకం పన్నామని, దాని ప్రకారమే ప్రియాంకను హతమార్చినట్లు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. తనతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేసేందుకు ప్రయత్నించిన సిద్ధేశ్పై ఒత్తిడి తెచ్చి పెళ్లి చేసుకుందన్న అక్కసుతోనే ప్రియాంకను హత్య చేశామని నిందితులు పోలీసులకు తెలిపారు.