సత్తా చాటాడు: ఇండియన్ ఆర్మీ టెక్నికల్ పరీక్షలో టాపర్గా హైదరాబాదీ..
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి విదుల్ తిమన్నా భారత భద్రతా దళం నిర్వహించే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్)లో సత్తా చాటాడు.
నవంబర్ 29న ప్రకటించిన ఫలితాల్లో విదుల్ టాపర్ గా నిలిచాడు. ప్రస్తుతం పూనేలోని ప్రతిష్టాత్మక ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విదుల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ లో టాపర్ గా నిలవడంతో పూనేలో ఇంజనీరింగ్ వదిలేసి.. మిలటరీ కాలేజీలో చేరేందుకు సన్నద్దమవుతున్నాడు.
విదుల్ తండ్రి ప్రస్తుతం సికింద్రాబాద్ లోని మిలటరీ కాలేజీలో ఎలక్ట్రానిక్స్&మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. ఆయన శౌర్య చక్ర అవార్డు గ్రహీత కావడం కూడా గమనార్హం.
టాపర్ గా నిలవడంపై విదుల్ తిమన్నా సంతోషం వ్యక్తం చేశాడు. భారత ఆర్మీకి సేవలందించాలన్నది తన చిరకాల కల అని అన్నాడు. సవాళ్లు, సాహసాలతో కూడిన ఆర్మీ జీవితాన్ని తాను ఇష్టపడుతానని చెబుతున్నాడు.
కాగా, భారత ఆర్మీ నిర్వహించే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఔత్సాహికులైన యువతను టెక్నో వారియర్స్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో సత్తా చాటిన వారు నాలుగేళ్ల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరమే 97శాతం మార్కులతో తిమన్నా ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. విదుల్ ప్రతిభ పట్ల అతని తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.