కరోనాకు విరుగుడు: ఫావిపిరావిర్ తయారీకి హైదరాబాద్ ఫార్మా సంస్థకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాదు: కరోనావైరస్ విరుగుడు మందు లేదా వ్యాక్సిన్ తయారీకి చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫావిపిరావిర్ ఔషధ తయారీకి ముందుకొచ్చిన హైదరాబాద్ ఫార్మా కంపెనీ బైయోఫోర్ ఇండియా ఫార్మాష్యూటికల్స్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్-19 తీవ్రత తక్కువ స్థాయిలో లేదా కాస్త మోడరేట్ స్థాయిలో ఉన్న సమయంలో వైరస్ను చంపేసేందుకు ఈ ఔషధం పనిచేస్తుంది. ఇప్పటికే దీని ఫార్ములేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని సంస్థ వెల్లడించింది.
Recommended Video
ఇక ఈ మెడిసిన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ దేశంలోనే తయారు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఎగుమతి చేసేందుకు కూడా అంగీకారం తెలిపింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇక టర్కీ నుంచి కూడా ఈ సంస్థ తయారు చేసే ఔషధానికి అప్రూవల్ లభించింది. అక్కడి స్థానిక సంస్థలో జతకట్టి ఈ ఔషధం తయారీకి టర్కీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు భారత్ బయోఫోర్ సంస్థ దేశంలోని ఇతర కంపెనీలతో కూడా జతకట్టి దీన్ని ప్రమోట్ చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఇక బంగ్లాదేశ్, ఈజిప్ట్లో ఇప్పటికే ఉన్న కంపెనీలు ఈ మెడిసిన్ ఎగుమతి చేయాల్సిందిగా కోరుతూ చర్చలు జరుపుతున్నట్లు బయోఫోర్ ఇండియా సంస్థ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దీని విరుగుడుకు తప్పని పరిస్థితుల్లో ఔషధం కనిపెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో సురక్షితంగా ఉండేందుకు ఎక్కడా రాజీ పడకుండా ఈ మందులను తయారు చేసే బాధ్యతను ఫార్మా కంపెనీలు తమ భుజాన వేసుకున్నాయి .తాము తయారు చేయనున్న ఫావిపిరావిర్ ఇటు నాణ్యతాపరంగా అటు సురక్షితంగా ఉంటుందన్న గ్యారెంటీ తాను ఇస్తున్నట్లు చెప్పారు ఆ సంస్థ వ్యవస్థాపకులు, చీఫ్ సైంటెఫిక్ ఆఫీసర్ మానిక్ రెడ్డి పుల్లగుర్ల. తాము తయారు చేసే ఔషధాలు అమెరికా మరియు ఐరోపా సమాఖ్య దేశాల నిబంధనలతో సరిపోలి ఉంటాయని చెప్పారు. అంతేకాదు అంతర్గతంగా క్వాలిటీ చెక్ మరింత కఠినంగా నిర్వహిస్తామని చెప్పారు మానిక్ రెడ్డి. తొలి ప్రాధాన్యతగా భారత దేశ అవసరాల కోసం ఫావిపిరావిర్ తయారు చేస్తున్నామని ఆ తర్వాత ఉత్పత్తిని పెంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని మానిక్ రెడ్డి చెప్పారు.
ఫావిపిరావిర్ అనేది శరీరంలోని మరో ఆర్ఎన్ఏ వైరస్ను చంపేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలో మరో ప్రాణాంతక వైరస్ ఉంటే దాన్ని చంపేందుకే దీన్ని కనుగొని తయారు చేయడం జరిగింది. ఇది విరుగుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే కోవిడ్-19కు ఈ మెడిసిన్ వినియోగించేలా భారత్, టర్కీ దేశాలతో పాటు రష్యా, మిడిల్ ఈస్ట్ దేశాలు అనుమతి ఇచ్చాయి. ఇతర దేశాల్లో ట్రయల్స్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఇక ఫావిపిరావిర్ మెడిసిన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ స్థానికంగా దొరికాయని కొన్నిటిని ఇక్కడే తయారు చేశామని చెప్పారు బైయోఫోర్ సీఈఓ జగదీష్ బాబు రంగిశెట్టి. కచ్చితంగా ఈ అడుగు భవిష్యత్తులో కరోనావైరస్పై పోరుకు మరింత బలం చేకూరుస్తుందని జగదీశ్ బాబు చెప్పారు.