బీజేపీకి నేనో ఐటెం గర్ల్!: వివాదాస్పద వ్యాఖ్యలపై ఎస్పీ నేత అజంఖాన్..
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఎస్పీ నేత అజంఖాన్ తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి తాను ఐటెం గర్ల్ లా మారిపోయానని అన్నారు.
లక్నో: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఎస్పీ నేత అజంఖాన్ తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి తాను ఐటెం గర్ల్లా మారిపోయానని అన్నారు. అందుకే బీజేపీ నేతలకు నేను తప్ప ఇంకెవరూ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. గత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోను బీజేపీ తననే టార్గెట్ చేసిందన్నారు.
భారత ఆర్మీపై అజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతున్న నేపథ్యంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్మీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోరగా.. అజంఖాన్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని, నా కారణంగా సైన్యం ఎందుకు దెబ్బ తింటుందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ వెళ్లినప్పుడే సైన్యం నైతికత దెబ్బ తిన్నదని అన్నారు.
కాగా, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే సైనికులపై తిరగబడాలని, వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అజంఖాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అంతేకాదు, వారి మర్మాంగాలు కోసిపారేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత దుమారమే రేపాయి. అజంఖాన్ గతంలోను చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అనిపించుకున్నారు. పెళ్లి చేసుకుని మగతనం నిరూపించుకోవాలని గతంలో ప్రస్తుత సీఎం యోగిని ఉద్దేశించిన ఆయన వ్యాఖ్యలు చేశారు.