నా తల్లి పుట్టిన తేదీ, పుట్టిన స్థలం నాకే తెలియదు.. మీరెలా చెప్పగలరు? : మోదీపై మమత ఫైర్
జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ జనాభా పట్టిక(NPR)లతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. వీటి పేరుతో ప్రజల్లో విద్వేషాలను,గందరగోళాన్ని నింపుతున్నారని ఆరోపించారు. తన తల్లి పుట్టిన తేదీ, పుట్టిన స్థలం గురించి తనకు తెలియదని.. అలాంటప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో మీరెలా చెబుతారని ప్రశ్నించారు. ఎన్ఆర్సీ,సీఏఏ,ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ గురువారం కోల్కతాలోని రాజా బజార్ నుండి ముల్లిక్ బజార్ వరకు మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ప్రజల మద్దతుతోనే ర్యాలీలు : మమతా
బెంగాల్ అల్లకల్లోలంగా మారిందంటూ కర్ణాటక బీజేపీ సర్కార్ చేసిన వ్యాఖ్యలను మమతా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ర్యాలీల్లో కర్ణాటకలోనూ ఇద్దరు మృతి చెందారని గుర్తుచేశారు. కేవలం బెంగాల్ పైనే విమర్శలు చేయడానికి వారు ఏమాత్రం సిగ్గుపడట్లేదన్నారు. కోల్కతాలో తాము చేపట్టిన ర్యాలీకి ప్రజల మద్దతు ఉందన్నారు. రోజులు గడుస్తున్న కొద్ది తమ నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నవారి సంఖ్య పెరుగుతోందని అన్నారు. నిరసన రూపాలను తాను పూర్తిగా ఆకలింపు చేసుకున్నానని, తన విద్యార్థి జీవితమంతా కాలేజీ గేట్ల ముందు, రోడ్లపై నిరసనలు చేశానని చెప్పారు.

ఇది భారతీయు పోరాటం : మమతా
విద్వేషాలకు బదులు తాము ప్రేమపూర్వక రాజకీయాలు చేస్తున్నామని మమతా అన్నారు. ప్రజలందరినీ కలుపుకునే నిరసనల్లో పాల్గొంటున్నామని చెప్పారు. ప్రజలు బాధపడుతుంటే, ప్రజలు తమ హక్కులు కోల్పోతుంటే.. తాము కచ్చితంగా పోరాడుతామని చెప్పారు. ఇది హిందువులు,ముస్లింలు,యావత్ భారతీయల నిత్య పోరాటమని పేర్కొన్నారు. ఉద్యమిస్తున్న విద్యార్థులను కూడా బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు.

నిప్పుతో చెలగాటం..
పౌరసత్వ చట్టాలను ఉపసంహరించుకునేంతవరకు శాంతియుత నిరసనలు చేస్తూనే ఉంటామని మమతా స్పష్టం చేశారు. బీజేపీ నిప్పుతో చెలగాటమాడుతోందని హెచ్చరించారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులు..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాలను మొదటినుంచి వ్యతిరేకిస్తున్నవాళ్లలో మమతా ముందు వరుసలో ఉన్నారు. బెంగాల్లో ఎన్ఆర్సీ,సీఏఏలను అమలుచేసేది లేదని ఆమె తేల్చి చెప్పారు. ఆ తర్వాత పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్,కేరళ సీఎం పినరయి విజయన్ కూడా పౌరసత్వ
చట్టాలను తమ రాష్ట్రాల్లో అమలుచేయబోమని చెప్పారు. ఇటీవలే ఏపీ సీఎం జగన్ కూడా ఎన్ఆర్సీ,సీఏఏలకు వ్యతిరేకంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications