ప్రధానమంత్రి మోడీ ఉన్నారని నేను అనుకోవడంలేదు: మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ ఉన్నారని భారతీయ జనతాపార్టీ నేత మిథున్ చక్రవర్తి వ్యాఖ్యానించారు. 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ నాకు టచ్లో ఉన్నారనే విషయాన్ని ఇంతకుముందే చెప్పానని, మళ్లీ చెబుతున్నానన్నారు. నేను చెప్పినదానికి కట్టుబడి ఉంటాను. అయితే 21 అనేది కచ్చితమైన నెంబరైతే కాదు.. ఇంకా పెరగొచ్చు.. కాకపోతే సమయం కోసం వేచిఉండండి అన్నారు. కోల్కతాలోని బీజేపీ కార్యాలయంలో మిథున్ మాట్లాడారు. గతంలో కూడా ఆయన దీనిపై వ్యాఖ్యలు చేశారు.
దుర్గా పూజ జరగడానికి ముందు కోల్కతాలో మిథున్ చక్రవర్తి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ సందర్భంగా ఆయన సమాధానాలిచ్చారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, అయితే దీని వెనక ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నారని నేను అనుకోవడంలేదంటూ ఇటీవలే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
దానిపై మిథున్ స్పందిస్తూ మమతాబెనర్జీ చెప్పింది సరైనదే కావొచ్చని, ప్రధానమంత్రి ఇవన్నీ చేయడంలేదు. కోర్టు ఆదేశాలుంటే మనం మాత్రం ఏం చేయగలమన్నారు. ఏ తప్పు చేయనివారు ఇంటికి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోతారని, కాకపోతే చిన్న ఆధారం దొరికినా రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎవరూ కాపాడలేరన్నారు.
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాబినెట్ మంత్రులపై సీబీఐ, ఈడీ దాడులు వరుసపెట్టి జరుగుతున్నాయి. పార్థా ఛటర్జీతోపాటు టీఎంసీకి చెందిన మరో జిల్లా అధ్యక్షుడిని అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో జరిగిన కుంభకోణాల్లో వీరి ప్రమేయముండటంతో మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టడానికి, ప్రభుత్వాన్ని కూలదోయడానికే మోడీ, అమిత్ షా ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ టీఎంసీ నేతలు మండిపడుతున్నారు.