మీ అమ్మా, నానమ్మను చంపేశా: కొడుకు, కూతుళ్లకు అమెరికాలోని భారత క్రీడాకారుడి ఫోన్, అరెస్ట్
వాషింగ్టన్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ మాజీ క్రీడాకారుడు తన తల్లిని, బార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత తనను తాను గాయపర్చుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
భారత్కు కాంస్యం తెచ్చిన ఇక్బాల్ సింగ్.. తల్లీ, భార్యను దారుణంగా..
పోలీసులు వివరాల ప్రకారం.. ఇక్బాల్ సింగ్(62) అనే వ్యక్తి 1983 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున పాల్గొని కాంస్య పతకం గెలుచుకున్నాడు. కువైట్లో జరిగిన ఈ క్రీడా ఈవెంట్ తర్వాత కొన్నాళ్లకు అతడు అమెరికాకు వలస వెళ్లాడు. టాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబంతో సహా డెలావర్ కౌంటీలోని న్యూటౌన్ టౌన్షిప్లో స్థిరపడ్డాడు. ఏమైందో తెలియదు గానీ.. ఇక్బాల్ సింగ్ ఆదివారం ఆకస్మాత్తుగా తన తల్లి నసీబ్ కౌర్, భార్య జస్పాల్ కౌర్పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. వారిద్దరినీ గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత తనను తాను అదే రీతిలో కత్తితో గాయపర్చుకున్నాడు.
మీ అమ్మ, నానమ్మను చంపేశానంటూ ఫోన్..
అంతేగాక, తన కొడుకుకు ఫోన్ చేసి.. ‘వాళ్లిద్దరినీ చంపేశాను. మీ అమ్మ, నానమ్మను హత్య చేశాను. పోలీసులను రమ్మను' అని చెప్పాడు ఇక్బాల్. అక్కడేవున్న కూతురుకి కూడా ఇదే విషయం గురించి ఫోన్లో తెలిపాడు. ఆ తర్వాత తానే పోలీసులకు ఫోన్ చేసి నేరం చేసిన తనను అరెస్ట్ చేయాలని కోరాడు.వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన ఇక్బాల్ సింగ్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అరెస్ట్ చేసిన పోలీసులు..
ఆ తర్వాత అతడిపై హత్యానేరం కింద అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు.
ప్రశాంతంగా ఉండేవారే కానీ..
కాగా, ఇక రెండు హత్యలు చేసిన ఇక్బాల్ సింగ్కు బెయిల్ మంజూరు చేసేందుకు స్థానిక కోర్టు నిరాకరించింది. ఇక ఇక్బాల్ సింగ్ ఎప్పుడూ తన నివాసం ఆవరణలో మెడిటేషన్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేవాడని ఇరుగుపొరుగువారు తెలిపారు. అయితే, హత్య ఘటనలకు ముందు మాత్రం కొంత ఆందోళనగా కనిపించారని తెలిపారు. ఇంత దారుణానికి పాల్పడితాడని తాము ఊహించలేదని చెప్పారు.