ట్రంప్ ఇలా ముంచుతాడని ముందే తెలుసు: మోదీ ఫస్ట్ రియాక్షన్
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.
ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం పడింది.. భారత్ పై.

ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అనంతరం వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ ను దిగుమతి చేసుకోవడాన్ని జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులపై 25 శాతం అదనపు టారిఫ్ ను విధించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.
దీనిపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమెరికా విధించిన అదనపు టారిఫ్ లను చెల్లించడానికి సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. 25 శాతం అదనపు టారిఫ్ ను కడతామని చెప్పారు.
దేశ రాజధానిలో ఈ ఉదయం ఏర్పాటైన ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంతర్జాతీయ శతాబ్ది సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. దేశంలో వివిధ వర్గాల ప్రజలు.. ప్రత్యేకించి రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడబోమని అన్నారు.
రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మోదీ తేల్చి చెప్పారు. వ్యవసాయం, పాడిపరిశ్రమ, చిన్న-సన్నకారులు రైతులు, ఆక్వా రంగం, మత్స్యకారులు.. ఇలా విభిన్న వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ ధోరణి ప్రదర్శించబోమని ఆయన స్పష్టం చేశారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "For us, the interest of our farmers is our top priority. India will never compromise on the interests of farmers, fishermen and dairy farmers. I know personally, I will have to pay a heavy price for it, but I am ready for it.… pic.twitter.com/W7ZO2Zy6EE
— ANI (@ANI) August 7, 2025
దీనికి తాను వ్యక్తిగతంగా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని, ఈ పరిస్థితి తలెత్తుతుందనే విషయం తనకు ముందే తెలుసునని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనికి తాను సిద్ధంగా ఉన్నానని, దేశం కూడా దానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications