రాహుల్ గాంధీ నోట.. జై మాతా దీ మాట: బీజేపీ బిగిన్స్
జమ్మూ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. రెండు రోజుల పర్యటనలో భాగంగా జమ్మూకు చేరుకున్నారు. గణేష్ చతుర్థిని పండగను పురస్కరించుకుని ఆయన ప్రఖ్యాత వైష్ణోదేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ మధ్య ఆయన ఆలయ సందర్శన సాగింది. వైష్ణోదేవి అమ్మవారి ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
త్రికూట పర్వతం మీద వెలిసిన వైష్ణోదేవి అమ్మవారిని దర్శించడానికి రాహుల్ గాంధీ 13 కిలోమీటర్ల మేర కాలి నడకన వెళ్లారు. కాట్రాలోని బేస్ క్యాంప్ నుంచి అమ్మవారి ఆలయానికి నడుచుకుంటూ వెళ్లారు. దర్శనం ముగించుకున్న అనంతరం జమ్మూలో పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను కాశ్మీరీ పండిట్ల కుటుంబానికి చెందినవాడిననే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కాశ్మీరీ పండిట్లు దేశానికి చాలా సేవలు చేశారని చెప్పారు. కాశ్మీరీ పండిట్స్కు చెందిన తన కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలను చేసిందని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ తనకు పుట్టినిల్లని, సొంత ఇంటికి వచ్చినట్లు భావిస్తుంటానని రాహుల్ గాంధీ అన్నారు. ఆ సమయంలో ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి రాహుల్ గాంధీ వైష్ణదేవి అమ్మవారికి జై కొట్టారు జై మాతా దీ అంటూ నినదించారు. జై మాతా దీ అంటూ నినదించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా సూచించారు. భారతీయ జనతా పార్టీ-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ రెండూ కలిసి జమ్మూ కాశ్మీర్లోని భిన్న సంస్కృతులను నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ చేస్తోన్న ప్రతి పనికీ ఆర్ఎస్ఎస్ వంత పాడుతోందని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని ధ్వజమెత్తారు. కాశ్మీరీల మధ్య ఉండే సోదర భావాన్ని బీజేపీ-ఆర్ఎస్ఎస్ తెంచి వేశాయని ఆరోపించారు. తన అరచేతిని చూపిస్తూ.. ఇలాంటి అభయహస్తాన్ని దేవుళ్లు ఇస్తుంటారని అదే అభయ హస్తాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తోందని అన్నారు.
కాశ్మీరీ ప్రజల ఉనికిని లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని, అందులో భాగంగానే రాష్ట్ర హోదాను తొలగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రాష్ట్రం హోదాను తిరిగి ఇస్తుందనే అభయ హస్తాన్ని ఇస్తున్నానని అన్నారు. జమ్మూ కాశ్మీర్కు తన కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఆ అనుబంధం మరిన్ని కాలాల పాటు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.
#WATCH | Congress leader Rahul Gandhi exhorts party workers to chant 'Jai Mata Di' at office bearers gathering in Jammu city of Jammu and Kashmir pic.twitter.com/DV91VuwgH6
— ANI (@ANI) September 10, 2021
ఈ ఉదయం తాను జమ్మూకు చేరిన వెంటనే కొన్ని కాశ్మీరీ పండిట్ కుటుంబాలు తనను కలిశాయని, కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధే తమను ఆదుకుందని విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు. బీజేపీ చేసిందేమీ లేదని ఆ కుటుంబాలు తనకు చెప్పాయని పేర్కొన్నారు. తన కాశ్మీరీ పండిట్ కుటుంబాల కోసం ఏదో ఒకటి చేస్తానని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. రెండు రోజుల జమ్మూ పర్యటన అనంతరం ఆయన లఢక్కు బయలుదేరి వెళ్తారు. కాగా- రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టింది. కాశ్మీర్ గురించి గానీ, కాశ్మీరీ పండిట్ల గురించి గానీ మాట్లాడే హక్కు రాహుల్కు లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తోన్నారు.