సీఎం సిద్దరామయ్యకు బీజేపీ ఎంపీ శ్రీరాములు చాలెంజ్: దమ్ముంటే బళ్లారిలో ?
బెంగళూరు/బళ్లారి: బీజేపీకి చెందిన శాసన సభ్యులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి మా పార్టీని ఓడించాలని చూస్తే సరైన బుద్ది చెబుతామని కర్ణాటక ముఖ్యమంత్రికి బళ్లారి లోక్ సభ సభ్యుడు (బీజేపీ) బి. శ్రీరాములు బహిరంగంగా సవాలు విసిరారు.
ఎమ్మెల్యే నాగేంద్ర !
బళ్లారి జిల్లా కూడ్లగి శాసన సభ్యుడు బి. నాగేంద్రను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్న సీఎం సిద్దరామయ్య మీద బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు తీవ్రస్థాయిలో విమర్శించారు. బళ్లారి జిల్లా హడగలిలో గురువారం జరిగిన బీజేపీ పరివర్తనా యాత్ర బహిరంగ సభలో ఎంపీ శ్రీరాములు సీఎం సిద్దరామయ్య మీద విమర్శలు గుప్పించారు.
సీఎం పగటి కలలు
బళ్లారి జిల్లాలోని 9 శాసన సభ నియోజక వర్గాల్లోని ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని ఇక్కడ విజయం సాధించాలని సీఎం సిద్దరామయ్య పగటికలలు కంటున్నారని, అది సాధ్యం కాదని శ్రీరాములు అన్నారు.
దమ్ముంటే బళ్లారిలో ?
మీకు చేతనైతే, దమ్ముంటే బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎంపీ శ్రీరాములు సీఎం సిద్దరామయ్యకు సవాలు చేశారు. ఐదేళ్లలో మీరే చేసిన అభివృద్ది శూన్యం, మీరు నిద్రపోవడానికి సమయం సరిపోయిందని సీఎం సిద్దరామయ్యను ఎంపీ శ్రీరాములు ఎద్దేవ చేశారు.
ఏం చెయ్యలేరు
బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ తల్లకిందలు తపస్సు చేసినా బీజేపీని ఏమీ చెయ్యలేదని, ఇక్కడి నాయకుల మధ్య విభేదాలు సృష్టించడం మీ తరం కాదని సీఎం సిద్దరామయ్యను ఉద్దేశించి ఎంపీ శ్రీరాములు విమర్శించారు.
అందుకే దెబ్బ
బళ్లారికి చెందిన కూడ్లగి శాసన సభ్యుడు బి. నాగేంద్ర, హోస్ పేట్ శాసన సభ్యుడు ఆనంద్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంలో బళ్లారిలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీరాములు సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.