ఆర్ కే నగర్ లో పోటీ చేస్తా: మేనత్త స్థానంలో ప్రజలకు సేవ చేస్తా, సీఎం మద్దతు ఇవ్వాలి: దీపా !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామేనత్త జయలలిత స్థానంలో ప్రజలకు నేనే సేవ చేస్తా, దీపా జయకుమార్సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో కచ్చితంగా తాను పోటీ చేసి విజయం సాధిస్తానని ఆమె మేనకోడలు దీపా జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని దీపా అన్నారు.
చెన్నైలో జయలలిత మేనకోడలు దీపా మీడియాతో మాట్లాడారు. జయలలిత చేసిన అభివృద్ది పనులు గుర్తు పెట్టుకుని ఆర్ కే నగర్ నియోజక వర్గం ప్రజలు తనను గెలిపిస్తారని దీపా జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనకు మద్దతు ఇస్తారని భావిస్తున్నానని దీపా అన్నారు.
టీటీవీ దినకరన్ కుళ్లు రాజకీయాలు చేస్తున్నాడని, శశికళ వర్గం తమిళనాడు ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నారని దీపా జయకుమార్ ఆరోపించారు. జయలలిత అధికారంలోకి తెచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్న శశికళ వర్గీయులకు పార్టీ కార్యకర్తలే తగిన బుద్ది చెబుతారని దీపా హెచ్చరించారు.
రాష్ట్రంలో డెంగ్యూ వ్యాదిని అరికట్టడంలో ఆరోగ్య శాఖ విఫలం అయ్యిందని దీపా ఆరోపించారు. జయలలిత అధికారంలోకి తెచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురాకూడదని దీపా జయకుమార్ మనవి చేశారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం నాదే, అందులో ఎలాంటి సందేహం లేదని దీపా జయకుమార్ తెలిపారు.