గాడిద, ఏ జైలో చెప్తే వెళ్తా: మమత, మోడీ వాగ్యుద్ధం
కోల్కతా: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే భారత దేశంలోకి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయులను వెనక్కి పంపిస్తామని మోడీ చెప్పారు. దీనిపై మమత రెండు రోజుల క్రితం ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారిని వెనక్కి పంపించే ముందు తనను పంపించాలని ఆమె మోడీకి సవాల్ చేశారు. దీనిపై మోడీ బుధవారం స్పందించారు. బంగ్లాదేశ్ చొరబాట్ల పైన తాను ఇప్పుడు చెబుతున్న విషయాన్ని 2005లోనే మమతా బెనర్జీ చెప్పారని, దీనిని ఆమె గుర్తుంచుకోవాలని మోడీ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే అక్రమంగా వచ్చిన వారిని వెనక్కి పంపిస్తామని చెప్పారు.
చొరబాటుదారుల పైన సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పు చెప్పిందన్నారు. తాము ఆ తీర్పు ప్రకారం నడుచుకుంటామని మోడీ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసేందుకు తమకు ఎలాంటి సందేహం లేదన్నారు.
మోడీ వ్యాఖ్యల పైన మమతా తీవ్రంగా స్పందించారు. ఒక్కరి పైన చేయి వేసి చూడాలని సవాల్ చేశారు. ఓ సందర్భంలో నరేంద్ర మోడీ ఓ గాడిద అని మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము దయతో మోడీని రాష్ట్రంలో ప్రచారం చేయనిస్తున్నామని, తాము అతనిని విమానాశ్రయం నుండే వెనక్కి పంపించేయగలమన్నారు. అస్సాం ఘర్షణలకు మోడీయే కారణమని, కులం పరంగా ఘర్షణలకు దారి తీసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని, ఆయనను అరెస్టు చేయాలని మమత అన్నారు.
మమత వ్యాఖ్యల పైన స్పందించిన మోడీ... తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. ఏ జైలో చెబితే తానే స్వయంగా వెళ్తానని, అక్కడ తాను బెంగాళీ నేర్చుకుంటానని మమతకు చురకలు అంటించారు. వామపక్షాలకు వ్యతిరేకంగా పోరాడితే తాము సంతోషిస్తామని కానీ, ఈ మూడేళ్లలో మమత తన వైఖరి మార్చుకున్నారని మోడీ ఆరోపించారు.