స్పాట్లో ఉండి ఉంటే.. నిందితుడిని కాల్చిపారేసేవాడిని : జామియా ఘటనపై మాజీ డీజీపీ
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. స్పాట్లో తాను ఉండి ఉంటే.. నిందితుడిని కాల్చిపారేసేవాడిని అన్నారు. మోకాళ్లలో షూట్ చేయడం ద్వారా కాల్పులు జరపకుండా అతన్ని అడ్డుకునేవాడినని చెప్పారు.
పోలీసులకు అవకాశం ఉన్నా అడ్డుకోలేదు..
కాల్పుల ఘటనను నిరోధించడంలో విఫలమైన ఢిల్లీ పోలీసులపై విక్రమ్ సింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ పోలీసులపై చాలా నమ్మకాలు ఉన్నాయని.. కానీ వారు తీవ్రంగా నిరాశపరిచారని అన్నారు. కాల్పులకు తెగబడ్డ షూటర్ రామభక్త్ గోపాల్ పోలీసులకు 20 నిమిషాల సమయం ఇచ్చాడని... అయినా పోలీసులు అతన్ని అడ్డుకోలేకపోయారని మండిపడ్డారు. నినాదాలు చేస్తూ గన్తో అతను గాల్లోకి కాల్పులు జరిపాడని.. పోలీసులు అతన్ని అడ్డుకునేందుకు అవకాశం ఉందని, కానీ వారి వైపు నుంచి అటువంటి ప్రయత్నమేదీ జరగలేదని అన్నారు.
పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే..
ఢిల్లీ పోలీసులు ఇలాగే ప్రేక్షకపాత్ర వహిస్తే... ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతాయని విక్రమ్ సింగ్ ఫైర్ అయ్యారు. జామియా మిలియా ఇస్లామియాలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధిత పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను డిమాండ్ చేశారు. అతన్ని ప్రేరేపించనవారెవరో తేలాలని.. దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ ఆయుధం అతని చేతుల్లోకి ఎలా వచ్చిందని.. అంతటి విద్వేషం అతని మైండ్లోకి ఎలా చొరబడిందని ప్రశ్నించారు.
కాల్పులు జరిపిన రామ్భక్త్ గోపాల్..
పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని వ్యతిరేకిస్తూ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి రాజ్ఘాట్ వరకు నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. ఇంతలో నల్లటి కోటు ధరించి అక్కడికి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. 'మీకు ఆజాదీ కావాలా.. అయితే తీసుకోండి.. జై శ్రీరామ్..' అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి బుల్లెట్ గాయలయ్యాయి. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఉత్తరప్రదేశ్లోని బౌద్దనగర్కి చెందిన రామ్భక్త్గోపాల్గా గుర్తించారు.
బీజేపీపై ఆరోపణలు..
జామియా వర్సిటీలో కాల్పుల కలకలం ఢిల్లీని ఒక్కసారిగా వణికించింది. ఘటనపై అప్పుడే రాజకీయ విమర్శలు,ఆరోపణలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలను అడ్డుకునేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఇలా కాల్పులు జరిపించిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. దీని వెనకాల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం తమపై వస్తోన్న ఆరోపణలను తీసిపుచ్చుతోంది.