పాకిస్తాన్, ప్రతిపక్షాలపై అరుణ్ జైట్లీ: ట్విట్టర్లో ఈ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోకి చొచ్చుకు వచ్చి ఉగ్రవాదులు పుల్వామాలో దాడి చేశారని, అందుకు ప్రతీకారంగా బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసిందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం చెప్పారు. మా సార్వభౌమత్వాన్ని మేం కాపాడుకుంటామన్నారు. పుల్వామా దాడి, బాలాకోట్ ప్రతీకారదాడిపై భారత్ మొత్తం ఏకతాటిపై నిలిచిందన్నారు.
ఇలాంటప్పుడు ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేయాలని చూడటం విడ్డూరమన్నారు. ఈ సమయంలో తాను ప్రతిపక్షాలకు ఓ పిలుపును ఇస్తున్నానని, దేశమంతా ఒకే మాటపై నిలబడి ఉందని, కాబట్టి ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మీ అనాలోచిత ప్రకటన పాక్కు ఉపయోగపడేలా ఉందన్నారు.
యుద్ధం వద్దని మలాలా
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్ర మోడీలకు మలాలా యూసఫ్ జాయ్ ఓ సూచన చేశారు. ఇరువురు ప్రధానులు ఇలాంటి సమయంలో తాము నిజమైన నాయకులమని నిరూపించుకోవాలని చెప్పారు.
అభినందన్, తీవ్రవాదం వద్దు, ముందు దేశం.. ట్రెండింగ్
పుల్వామా దాడి, భారత్ ఎయిర్ స్ట్రైక్స్ అనంతర పరిణామాలు భారత్, పాక్ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎక్కడ యుద్ధం వస్తుందోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సోషల్ మీడియా వేదికగా యుద్ధం వద్దని ట్వీట్లు చేస్తున్నారు. దాంతో 'saynotowar' అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీని కంటే ఎక్కువగా SayNoToTerrorism (టెర్రరిజం వద్దు), NationFirst (ముందు దేశం) అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే పాకిస్తాన్ను ఉపేక్షించవద్దని ఇందులోని అర్థం కనిపిస్తోంది. అన్నింటి కంటే ఎక్కువగా Abhinandan, BringBackAbhinandan ట్రెండ్ అవుతున్నాయి.