Abhinandan Varthaman: పాకిస్తాన్ పీచమణిచిన ఎయిర్ఫోర్స్ హీరోకు ప్రమోషన్
న్యూఢిల్లీ: బాలాకోట్ వైమానిక దాడులు.. పాకిస్తాన్ ప్రోత్సాహిత జైషె మహ్మద్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని అవంతిపొరలో సృష్టించిన మారణ హోమానికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన మెరుపు దాడి ఇది. పాకిస్తాన్లోని ఖైబర్ ఫక్తున్ఖ్వాలోని బాలాకోట్ పర్వత శ్రేణుల్లో వెలిసిన జైషె మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను నేలకూల్చారు వైమానిక దళాధికారులు. సరిహద్దులను దాటుకుని వెళ్లి మరీ పాకిస్తాన్ పీచమణిచారు.
కోవాగ్జిన్ ఎక్స్పైరీ డేట్ ఇదే: తయారు చేసిన తేదీ నుంచి బెస్ట్ బిఫోర్ యూజ్..!
మళ్లీ మార్మోగుతోన్న అభినందన్ పేరు..
ఈ వైమానిక దాడులకు నాయకత్వాన్ని వహించిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్.. తాజాగా వార్తల్లోకి ఎక్కారు. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో హీరోగా గుర్తింపు పొందారాయన. పాకిస్తాన్ యుద్ధ విమానం ఎఫ్-16ను నేలకూల్చారు. అనంతరం పొరపాటున పాకిస్తాన్ భూభాగంపైకి దిగారు. ఆయనను యుద్ధ సైనికుడిగా బంధించారు ఆ దేశ సైనికులు. ఆయన పాకిస్తాన్ చేతికి చిక్కడంతో కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది.
పాకిస్తాన్ను గుక్క తిప్పుకోనివ్వని భారత్..
దౌత్యపరంగా ఒత్తిళ్లను తీసుకొచ్చింది. అంతర్జాతీయ వేదికల నుంచి పాకిస్తాన్పై అన్ని రకాల ఆంక్షలు, ఒత్తిళ్లకు లోను చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాకిస్తాన్ మెత్తబడింది..మెట్టుదిగింది. అభినందన్ వర్థమాన్ను క్షేమంగా భారత్కు అప్పగించింది. వాఘా సరిహద్దుల గుండా ఆయన దర్జాగా మాతృభూమిపై అడుగు పెట్టారు. అప్పట్లో యావత్ భారత్ ఆయనను హీరోగా కీర్తించింది. ఆన చేసిన సాహసాన్ని కథలుగా చెప్పుకొన్నారు. బాలీవుడ్లో సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు అప్పట్లో సాగాయి.
వార్తల్లో నిలిచిన అభినందన్ పేరు..
ఇప్పుడు తాజాగా అభినందన్ వర్థమాన్ పేరు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. వైమానిక దళాధికారులు ఆయనకు ప్రమోషన్ ఇవ్వడమే దీనికి కారణం. వింగ్ కమాండర్గా ఉన్న అభినందన్ను గ్రూప్ కేప్టెన్ ర్యాంక్ స్థాయి అధికారికగా పదోన్నతి కల్పించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. అభినందన్కు ఇదివరకే కేంద్ర ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డుతో సత్కించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా ఆయనకు పదోన్నతి కల్పించింది.
కల్నల్ ర్యాంక్కు సమానం..
వైమానిక దళంలో గ్రూప్ కేప్టెన్ అంటే.. సైన్యంలో కల్నల్ స్థాయికి సమానమైన ర్యాంక్ ఇది. శ్రీనగర్ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తోన్న 51 స్క్వాడ్రన్ విభాగంలో అభినందన్ వర్థమాన్ ఇప్పటిదాకా వింగ్ కమాండర్గా పని చేశారు. ఇప్పుడు గ్రూప్ కేప్టెన్ స్థాయికి ఎదిగారు. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన జైషె మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అప్పట్లో 40 మంది వరకు కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగాలకు చెందిన జవాన్లు అమరులయ్యారు.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా..
దీనికి ప్రతీకారంగా అదే నెల 27వ తేదీన వైమానిక దళం బాలాకోట్పై దాడులను నిర్వహించింది. ఉగ్రవాదుల శిబిరాలను పెకిలించి వేసింది. బాంబుల వర్షాన్ని కురిపించింది. ఊపిరి తీసుకోనివ్వని పరిస్థితిని కల్పించింది. ఏకధాటిగా బాంబులు, మిస్సైళ్లను సంధించింది వైమానిక దళం. అప్పట్లో 30 మందికి పైగా ఉగ్రవాదులు దుర్మరణం పాలైనట్లు వార్తలు వచ్చాయి. దాన్ని పాకిస్తాన్ నిర్ధారించలేకపోయింది. ఆ దాడుల్లో మిగ్ యుద్ధ విమానాన్ని నడిపారు అభినందన్ వర్థమాన్.. భారత్ గగనతలంలోకి చొచ్చుకుని వచ్చిన పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తరిమికొట్టారు. దాన్ని నేలకూల్చారు.