మహిళా అధికారిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన ఐఏఎస్
స్విమ్మింగ్ ఫూల్లో నీటిలో మునిగిపోతున్న ఓ మహిళా ట్రైనీ ఐఏఎస్ అధికారిని కాపాడబోయి మరో ఐఏఎస్ అధికారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: స్విమ్మింగ్ ఫూల్లో నీటిలో మునిగిపోతున్న ఓ మహిళా ట్రైనీ ఐఏఎస్ అధికారిని కాపాడబోయి మరో ఐఏఎస్ అధికారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న ఆశీష్ దహియా(30) సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇనిస్టిట్యూట్లో ఉన్న స్విమ్మింగ్ఫూల్ కు వెళ్లాడు. ఇంతలో ఓ మహిళా అధికారి స్విమ్మింగ్ ఫూల్లో పడిపోవడంతో ఆమెను కాపాడడానికి కొందరు ట్రైనీ ఐఏఎస్లు అందులోకి దూకారు. వారిలో ఆశీష్ కూడా ఉన్నారు.
ఆమెను రక్షించి మిగిలిన అధికారులు ఒడ్డుకు చేరుకోగా.. ఈత అంతగా రాని ఆశీష్ మాత్రం నీటిలో మునిగిపోయారు. ఇది గమనించిన మిగిలిన వారు ఆశీష్ కోసం నీటిలో దూకారు. ఆశీష్ను ఒడ్డుకు చేర్చి మెడికల్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చారు.
ఈలోగా ప్రాథమిక చికిత్స అందించినా ఆశీష్ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆస్పత్రికి చేర్చగా అప్పటికే ఆశీష్ మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన సమయంలో ఆశీష్ ఏమైనా మద్యంసేవించారా? అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఉన్న ఇతర అధికారుల నుంచి వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.