ఆల్ఖైదా ఉపఖండ చీఫ్ భారతీయుడేనా?
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ అయిన ఆల్ఖైదా ఉపఖండ కొత్త అధిపతిగా నియమితులైన అసీమ్ ఉమర్ భారత దేశానికి చెందిన వ్యక్తి అని ప్రముఖ పాకిస్థాన్ జర్నలిస్టు హమీద్ మీర్ వ్యాఖ్యానించాడు. కాగా, హమీద్ వ్యాఖ్యలను భారత ఇంటెలిజెన్స్(ఐబి) కూడా అంగీకరించింది. అంతేగాక ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా ధృవీకరించారు. అసీమ్ ఉమర్కు భారతదేశంతో విస్తృత సంబంధాలున్నాయని చెప్పారు. వీటిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆల్ఖైదా రీజనల్ చీఫ్ భారతీయుడే: ఐబి ధృవీకరణ
భారతదేశంలో తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అసీమ్ ఉమర్ అనే వ్యక్తికి గత నెలలో ఆల్ఖైదా బాధ్యతలను అప్పగించింది. కాగా, అతడు భారతదేశానికి చెందిన వ్యక్తేనని ఐబి అధికారులు కూడా అంగీకరించారు. ఉమర్ గురించి అధ్యయనం చేసిన ఐబి అధికారులు, ఉత్తరప్రదేశ్కు చెందినవాడిగా గుర్తించారు. ఉమర్ భారతీయుడని ఖచ్చితంగా చెప్పగలం, అయితే అతని మూలాల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పారు.

ఉమర్కు భారతదేశంతో దృఢ సంబంధాలు: సిమి
ఉమర్ వివరాల గురించి పాట్నా పేలుళ్లకు పాల్పడిన సిమి కార్యకర్త హైదర్ అలీని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రశ్నించాయి. హైదర్.. అసీమ్ ఉమర్ అలియాస్ షేక్ ఉమర్ గురించి ఎక్కువ వివరాలు చెప్పనప్పటికీ, భారతదేశంతో అతనికి దృఢమైన సంబంధాలున్నాయని చెప్పాడు. ఉమర్ భారతీయుడా? కాదా అనే విషయంపై అతడు ఏమి చెప్పలేదు.
అసీమ్ ఉమర్ అలియాస్ షేక్ ఉమర్ ఎవరు?
1989 నుంచి ఉమర్ భారతదేశంలోనూ, బయట ఉన్నాడు. అతడు ఇండియాలో ఉన్నప్పుడు సిమి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఆ తర్వాత 1995లో శాశ్వతంగా తన నివాసాన్ని పాకిస్థాన్లోని కరాచీకి మార్చాడు. అక్కడే జామీయా ఉలూమ్ ఈ ఇస్లామియా ఏ స్కూల్లో అభ్యసించాడు. కాగా, ఉమర్కు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు, అతని వీడియోలను పరిశీలిస్తున్నట్లు ఐబి అధికారులు వెల్లడించారు.
ఐబి అధికారుల సమాచారం ప్రకారం.. ఉమర్ మాట్లాడే ఉర్దూ భాష భారతదేశంలో మాట్లాడే ఉర్దూకు దగ్గరి సంబంధాలున్నాయి. ఇది అతడు భారతదేశానికి చెందిన వ్యక్తి అనడానికి బలం చేకూరుస్తోంది. కాశ్మీర్ కారణంగానే అతడు ఉగ్రవాదం వైపు వెళ్లేలా చేసినట్లు తెలుస్తోంది. అతడు కరాచీకి వెళ్లి.. అక్కడే కొంతకాలం తన చదువును కొనసాగించాడు.
ఉగ్రవాద సంస్థ అయిన హక్రత్ ఉత్ ముజాహిదీన్ దుస్తులను అతడు మొదట ధరించాడు. ఆ సమయంలో భారత సైన్యాలను ఎదుర్కొనేందుకు ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ కరాచీకి చేరుకుని జామీయా ఉలూమ్ ఈ ఇస్లామియాలో బోధన చేయడం ప్రారంభించాడు.
ఉమర్కు భారతదేశంలోని సిమికి సంబంధాలు
ఉమర్ పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ దేశాల్లో ఉన్నప్పటికీ భారతదేశంలోని నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమితో తన సంబంధాలను కొనసాగించాడు. సఫ్ధార్ నగోరి నాయకత్వంలోని సిమి.. ఆల్ఖైదాకు మద్దతుగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దీంతో ఆల్ఖైదా ఉమర్ ద్వారా సిమితో సంబంధాలను కొనసాగించింది. ఆల్ఖైదా అగ్ర నాయకుడితో తనకు సంబంధాలున్నాయని నగోరి ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఆ అగ్రనాయకుడు ఉమర్ కావొచ్చని ఐబి అధికారులు అనుమానిస్తున్నారు.
భారతదేశంపై ఉమర్ ఆసక్తి
ఆల్ఖైదా మిగిలిన కార్యకలాపాలతో కంటే భారతదేశంలో ఆ సంస్థ చర్యల పట్ల ఉమర్ ఆస్తికిగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘మీ సాగరంలో ఎందుకు తుఫాను రావడం లేదు' అనే వ్యాఖ్యలను భారత ముస్లింలను ఉద్దేశించి అతడు చేసినట్లు తెలుస్తోంది. భారత ముస్లింలను ఆల్ఖైదాలో చేర్చుకునేందుకు అతడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీహార్ను ఉద్దేశించి అతడు వ్యాఖ్యానిస్తూ..‘బీహార్ ఒక్క ముజాహిదీన్ తయారు చేయలేదా' అని ఉమర్ అన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏ తల్లి కూడా తన కొడుకు ముజాహిదీన్లో చేరేందుకు పాట పాడటం లేదా? అని అతడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను సిమి కేంద్రంగా మార్చేందుకు ఉమర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఈ సంస్థలకు సానుభూతిపరులుగా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడే తమ శాఖను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
భారత్తో ఉమర్కు రహస్య సంబంధాలు
అతిపెద్ద రహస్యమేమిటంటే ఉమర్ భారత సంతతికి చెందిన వ్యక్తి. గత పది సంవత్సరాల నుంచి ఇతడు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ దేశాల్లో ఆశ్రయం పొందుతున్నాడు. ఐఎస్ఐతో కూడా ఇతడికి సంబంధాలున్నాయి. అయితే ఉమర్ తన ముఖాన్ని ఎప్పుడూ మీడియాకు చూపలేదు. ఆల్ఖైదా కార్యకర్తలు, ఆల్ఖైదా నాయకుడు అయామన్ ఆల్ జవహరికి మాత్రమే అతడి గురించి తెలిసినట్లుగా సమాచారం.
ఉమర్ ముఖం ఎవరికీ తెలియకపోవడంతో ఉత్తరప్రదేశ్లోని పలువురిని ప్రశ్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఐబి అధికారులు తెలిపారు. హైదర్ అలీ, సఫ్దార్ నగోరిలకు మాత్రమే ఉమర్ గురించి తెలిసే అవకాశం ఉందని చెప్పారు. భారతదేశంలో ఆల్ఖైదాను విస్తరించేందుకే అతన్ని నియమించినట్లు వారు చెబుతుండటం గమనార్హం.
భారత ఉర్దూలో మాట్లాడే వ్యక్తితో తమకు సంబంధాలున్నాయని, అతడే భారతదేశంలో ఆల్ఖైదా కార్యకలాపాలను విస్తరింపజేస్తాడని హైదర్, నగోరీలు చెబుతున్నారు. భారతదేశంలో పలువురు యువకులు ఆల్ఖైదాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని కూడా వారు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 30మంది యువలకులను చేర్చుకునేందుకు ఆల్ఖైదా ఇప్పటికే తన ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన భత్కల్ లాంటి ఉగ్రవాదులు, సిమితో సంబంధాలున్నవారు ఆల్ఖైదాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications