ఛాయ్ వాలా పీఎం అయితే, నేను సీఎం కాలేనా?: ఉద్ధవ్
న్యూఢిల్లీ: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్నికల రోజైన బుధవారం కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. "టీ కొట్టు నడిపిన వ్యక్తి ప్రధాని అయినప్పుడు, తాను ముఖ్యమంత్రిని కాలేనా?" అంటూ ప్రశ్నించారు.
శివసేన సొంత పత్రిక సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాటి సామ్నా సంచికలో ఈ ఇంటర్వ్యూ ప్రచురితమైంది. 25 ఏళ్లుగా బీజేపీతో కలిసి పనిచేశామని, అయితే బీజేపీ వ్యవహారంతో ప్రస్తుత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెప్పారు. అయితే గెలుపు మాత్రం తమదేనని థాకరే ధీమా వ్యక్తం చేశారు.
ఉద్దవ్పై మండిపడ్డ భాజపా
‘ఛాయ్ వాలా పీఎం అవగా లేనిది, నేను సీఎం కాలేనా' అంటూ ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం. అయితే తమపై దూషణలకు దిగే వారిని మాత్రం వదలబోం. తగిన గుణపాఠం చెబుతాం' అంటూ ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం చెప్పారు.
మహారాష్ట్రలో పోలింగ్ కొనసాగుతుండగానే ఈ విషయంపై వివాదం చెలరేగింది. ‘25 ఏళ్లుగా శివసేనతో కలిసి పోటీ చేశాం. విజయాన్ని చూశాం. ఓటమిని ఎదుర్కొన్నాం. అయితే స్నేహం విడిపోయిన వెంటనే ప్రధాని మోడీపై థాకరే అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్టు కాదు' అని ఆయన శివసేనకు గట్టిగా బదులిచ్చారు.
ఇది ఇలా ఉంటే మహారాష్ట్రలో పోలింగ్ జరుగుతుండగానే శివసేన భారీ పత్రికా ప్రకటనలు ఇచ్చింది. సాధారణంగా ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ రోజున ఇలాంటి ప్రకటనలు ఇవ్వకూడదు. అందుకు విరుద్దంగా శివసేన బాల థాకరే, ఉద్దవ్ థాకరేల ఫోటోలు, బాణం గుర్తులతో కూడిన ఓ భారీ ప్రకటనను శివసేన అధికార పత్రికలైన సామ్నా, దోపహర్కా సామ్నా బుధవారం నాటి మొదటి ఎడిషన్లో ఇచ్చింది.
ముంబైలోని మరో మీడియాకు ఇంకో ప్రకటన ఇచ్చింది. అందులో ప్రత్యర్ది పార్టీలను టార్గెట్ చేసింది. "రావణుడిని హస్తంతో (కాంగ్రెస్ గుర్తు), వాచీతో (ఎన్సీపీ) లేదా పువ్వుతో (బీజేపీ) చంపేదు. ధనస్సుతో బాణం వేసి చంపారు" అని ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటనను బట్టి మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ శివసేన గుర్తు ధనస్సు, బాణంకే ఓటు వేయాలని పరోక్షంగా సూచించారు.