ఇష్టం లేకుంటే తొలగిస్తాం: తగ్గిన మోడీ, కాంగ్రెస్ గెలిచేది కదా అని చురక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన ధోరణికి భిన్నంగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది! శుక్రవారం ఆయన లోకసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా భూసేకరణ బిల్లులో రైతులకు ఇష్టం లేనివి ఏమైనా ఉంటే తొలగిస్తామని, సవరణలకు సిద్ధమని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన పరోక్షంగా నిప్పులు చెరగడంతో పాటు ఆ పార్టీకి చురకలు అంటించారు. ప్రస్తుత దేశ పరిస్థితికి గత పాలకులే కారణమన్నారు. ప్రధాని మోడీ లోకసభలో సుదీర్ఘంగా మాట్లాడారు.
ఎంపీలు సానుకూల ధోరణి అలవర్చుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ పైన దృష్టి పెట్టాలన్నారు. రాజకీయాలు పక్షపాతాలకు అతీతంగా ఉండాలన్నారు. పాత పథకాలను మారుస్తున్నారన్న విమర్శ వస్తోందని, పేరు ఏదైనా సమస్యలు పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పారు.
యూపీఏ బిల్లులోని లోపాలను తాము సవరిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన భూసేకరణ పైన కాంగ్రెస్ బిల్లు నచ్చితే పార్టీ గెలిచేది కదా అని చురకలు అంటించారు. భూసేకరణ చట్టం రైతులకు వ్యతిరేకం కాదన్నారు. పేదలకు లబ్ధి చేకూరాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధమన్నారు. చట్టంలో రైతులకు ఆమోదయోగ్యం కాని అంశాలు తొలగిస్తామని చెప్పారు.
ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తామన్నారు. స్కూల్లో మరుగుదొడ్లు లేక బాలికలు చదువు మానేయడం విచారకరమన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారముంటుందని చెప్పారు. దేశ పరిస్థితికి గత పాలకులదే బాధ్యత అన్నారు. ఈ తొమ్మిది నెలల్లో తాము ఎంతో చేశామని, దానిని చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. అవినీతి వల్లే దేశం భ్రష్టు పట్టిందన్నారు.
అవినీతి నుండి దేశాన్ని బయటపడేయాల్సి ఉందన్నారు. రేడ్ టేపిజాన్ని అంతం చేస్తామన్నారు. బొగ్గు గనుల ద్వారా లక్ష కోట్లు సేకరించినట్లు తెలిపారు. నల్లధనం అంశంపై సుప్రీం కోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉన్నతస్థాయి కమిటీ వేశామని చెప్పారు. ప్రపంచంలో భారత్ను నెంబర్ వన్గా నిలపడమే తమ లక్ష్యమన్నారు.
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం చేయూతనిస్తుందని చెప్పారు. రాష్ట్రాల స్వయం సమృద్ధే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయని, కాని దేశం మాత్రం ప్రజల వల్ల ముందుకు పోతుందన్నారు. ప్రజల శక్తి, సామర్థ్యాలతో దేశం నిర్మాణమవుతుందన్నారు. ప్రధాని ప్రసంగంపై విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని చాలా గొప్పగా ప్రసంగించారని, అయితే మాటలతో కడుపు నిండదన్నారు.