మేమొచ్చాక ‘అమ్మ’ మృతి మిస్టరీ ఛేదిస్తాం.. వారిద్దరిపై విచారణ కమిషన్ కూడా: స్టాలిన్
తాము అధికారంలోకి రాగానే జయలలిత మరణం వెనక దాగి ఉన్న రహస్యాన్ని ఛేదిస్తామని, అలాగే శశికళ, పన్నీరు సెల్వంపై కూడా విచారణ కమిషన్ వేస్తామని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
చెన్నై: తాము అధికారంలోకి రాగానే జయలలిత మరణం వెనక దాగి ఉన్న రహస్యాన్ని ఛేదిస్తామని, అలాగే శశికళ, పన్నీరు సెల్వంపై కూడా విచారణ కమిషన్ వేస్తామని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
సోమవారం ఆర్కే నగర్ నియోజకవర్గం పరిధిలోని ఓ కల్యాణ మండపంలో జాలర్ల సమస్యలపై జరిగిన సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మళ్లీ రాష్ట్ర వ్యాప్త పర్యటన...?
గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ‘మనకు.. మనమే' అనే నినాదంతో స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పర్యటనకు అమిత స్పందన లభించిన నేపథ్యంలో మళ్లీ స్టాలిన్ అన్ని వర్గాల ప్రజలను ఒకసారి కలుసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఆర్కే నగర్ నియోజకవర్గం పరిధిలోని జాలర్లతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి జాలర్ల సంఘాల ప్రతినిధులు, పెద్ద ఎత్తున జాలర్ల కుటుంబాలు హాజరై తమ సమస్యలను స్టాలిన్ కు విన్నవించుకున్నారు.
మరింత కఠినంగా వ్యవహరించాలి...
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ ఆర్కేనగర్ లో ఎన్నికల యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. తక్షణం పరిశీలించి చర్యలు తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు.
ఆ ఆరోపణలపై మాట్లాడదలచుకోలేదు...
రెండాకుల గుర్తు తన రూపంలో అన్నాడీఎంకేకు దైరమైనట్లుగా టీటీవీ దినకరన్ చేస్తున్న ఆరోపణలపై తాను స్పందించదలచుకోలేదన్నారు. ఇలాంటి వారిపై కూడా విమర్శలు గుప్పించి తన స్థాయిని దిగజార్చుకోదలచుకోలేదని వ్యాఖ్యానించారు.
అండగా నిలిచింది ఈ తల్లులే...
జల్లికట్టు మద్దతు ఉద్యమకారులను అణచివేయడానికి పోలీసులు సాగించిన ప్రయత్నాల తీరు సర్వత్రా ఖండించదగినవేనన్నారు. ఆ సమయంలో పోలీసుల నుంచి విద్యార్థులను కాపాడేందుకు వారికి అండగా నిలిచింది జాలర్ల కుటుంబాలకు చెందిన తల్లులేనంటూ వారిని అభినందించారు.
అప్పుడెందుకు నోరు మెదపలేదు?
అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని పన్నీరు సెల్వం ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, తాను ఒక్కటే చెప్పదలచుకున్నానని, డీఎంకే అధికారంలోకి రాగానే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. శశికళ, పన్నీరు సెల్వంపై కూడా విచారణ కమిషన్ వేస్తామని, న్యాయ విచారణలోనే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్టాలిన్ భరోసా వ్యక్తం చేశారు.