కరెంట్, నల్లా బిల్లు ఉంటే చాలు.. లోన్ వచ్చినట్లే!
కేవలం విద్యుత్తు బిల్లు, నల్లా బిల్లుతో 48 గంటల్లో ప్రైవేటు బ్యాంకులు లోన్లు ఇచ్చే రోజులు రాబోతున్నాయి.
న్యూఢిల్లీ: బ్యాంకు రుణాలు మరింత సులువుగా దొరికే అవకాశాలు వెల్లువెత్తనున్నాయి. కేవలం విద్యుత్తు బిల్లు, నల్లా బిల్లుతో 48 గంటల్లో ప్రైవేటు బ్యాంకులు లోన్లు ఇచ్చే రోజులు రాబోతున్నాయి.
రుణం కావలసిన వారు బ్యాంకు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగనక్కర్లేదు. ఇకనుంచి బ్యాంకు సిబ్బందే రుణం తీసుకునే వారి చుట్టూ తిరగనున్నారు. అంతేకాదు - నిమిషాల్లో రుణ అర్హతను అంచనా వేసి, ఎలాంటి హామీ లేకుండానే ఒకటి.. రెండు రోజుల్లో లోన్ ఇచ్చేస్తారు.
ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన చర్యలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద నిధుల లభ్యత, రుణ అర్హతను నిమిషాల్లో అంచనా వేయగలిగే సాంకేతికత, రుణ గ్రహీత బ్యాంకు ఖాతాకు సిబిల్, ఆధార్ వంటి వ్యవస్థలను అనుసంధానం చేయడం వంటి పరిణామాలు.. భవిష్యత్తులో ఇలాంటి హామీ లేని రుణాలను పెంచానున్నాయి.
"మీ దగ్గర కరెంటు బిల్లుగాని లేదంటే మంచినీటి బిల్లుగాని ఉంటే చాలు.. మా వెబ్ సైట్ ద్వారా రూ.50 లక్షల వరకు హామీ లేని రుణాన్ని రెండు రోజుల్లో బ్యాంకులు అందిస్తాయి. మా సొంత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ద్వారా రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాన్ని ఇస్తున్నాం.." అని ఇన్ స్టా ఈఎంఐ సీఈఓ హను యడ్లూరి చెప్పడం చూస్తే అతి త్వరలోనే.. ఈ రకం రుణాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయనిపిస్తోంది.