CBSE గుట్టు విప్పిన క్లాడ్ ఏఐ! పోర్టల్లో తీవ్ర భద్రతా లోపాలు?
భారతదేశ విద్యా రంగంలో డిజిటల్ భద్రతకు సంబంధించి ఒక సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సీబీఎస్ఈ (CBSE) మూల్యాంకన పోర్టల్లో తీవ్రమైన సైబర్ భద్రతా లోపాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్కు చెందిన ఉన్నత స్థాయి నిపుణుల బృందం.. క్లాడ్ (Claude) వంటి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ను ఉపయోగించి సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) ప్లాట్ఫామ్లో ఉన్న లోపాలను వెలికితీశారు. ఈ పరిశోధనలు దేశంలోని పరీక్షా సాంకేతిక మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం భద్రతాపరమైన కఠిన సమీక్షలు, అత్యవసర నిఘాను పెంచేలా చేశాయి.
లక్షలాది అభ్యర్థుల సున్నితమైన డేటాను నిర్వహించే ఆన్లైన్ ప్లాట్ఫామ్ల సైబర్సెక్యూరిటీ సంసిద్ధతపై ఆందోళనలు రేగడంతో ప్రభుత్వం ఈ ఐఐటీ నిపుణుల కమిటీని నియమించింది. ఈ ప్యానెల్ జరిపిన పరిశీలనలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. సీబీఎస్ఈ, ఓఎస్ఎం పోర్టల్ల భద్రతను పర్యవేక్షిస్తున్న కెంప్ట్ ఎడ్యుటెక్ (Coempt Edutech) అనే ప్రైవేట్ వెండర్కు ఇటువంటి కీలకమైన జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను రక్షించడానికి అవసరమైన కనీస భద్రతా యంత్రాంగాలపై తగిన నైపుణ్యం, అవగాహన లేవని కమిటీ తేల్చిచెప్పింది. దీంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నూలజీ మంత్రిత్వ శాఖ (MeitY), ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తక్షణమే రంగంలోకి దిగాయి.

ప్రభుత్వం తక్షణ జోక్యం.. సేఫ్ జోన్లోకి డేటా!
ఐఐటీ ప్యానెల్ ఇచ్చిన నివేదికతో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు చేపట్టింది. సీబీఎస్ఈకి సంబంధించిన కీలకమైన ఓఎస్ఎం డేటాను సదరు ప్రైవేట్ వెండర్ నిర్వహించే సర్వర్ల నుండి తొలగించి, MeitY మద్దతుతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఇండియాలోని ప్రభుత్వ నియంత్రణలో ఉన్న అత్యంత సురక్షితమైన విభాగానికి మార్చారు. గత వారం రోజులుగా రాత్రింబగళ్లు శ్రమించిన ఈ నిపుణుల బృందం, జూన్ 2న కొద్దిపాటి జాప్యంతోనైనా సీబీఎస్ఈ వెరిఫికేషన్, రీ-ఎవాల్యూషన్ పోర్టల్ విజయవంతంగా ప్రారంభమయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది.
జేఈఈ అడ్వాన్స్డ్, జోసా (JoSAA) లకూ గండం గండం!
ఈ నిపుణుల కమిటీ కేవలం సీబీఎస్ఈతోనే ఆగకుండా ఇతర ప్రతిష్టాత్మక పరీక్షా ప్లాట్ఫామ్లను కూడా జల్లెడ పట్టింది. జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) అడ్మిట్ కార్డుల కాపీలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో డేటా లీక్ అయిందన్న వార్తలు గుబులు రేపాయి. దీంతో బుధవారం నాటికి జాయింట్ సీట్ అలాట్మెంట్ అథారిటీ (JoSAA), జేఈఈ అడ్వాన్స్డ్ మౌలిక సదుపాయాలపై నిపుణులు పూర్తిస్థాయి భద్రతా అంచనాను పూర్తి చేశారు. వాటిలోని లోపాలను గుర్తించి, పూర్తిగా సరిదిద్దిన తర్వాతే ఆయా వేదికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ పోర్టల్పై అధికారిక సైబర్ ఆడిట్ నిర్వహించాలని CERT-Inను ప్రభుత్వం ఆదేశించింది.
ఇది సైబర్ దాడి కాదు.. మరికొన్ని చోట్ల దాడుల కలకలం!
అయితే, అధికారులు ఈ సంఘటనను సాంప్రదాయ సైబర్ దాడిగా భావించడం లేదు. పోర్టల్ లైవ్లోకి వెళ్లేముందు దాని బలహీనతలను పరీక్షించిన ఎథికల్ హ్యాకర్ల పనే ఇదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ, మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఆదివారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది అనధికారికంగా యాక్సెస్ చేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అదే రోజు జరిగిన సీయూఈటీ (CUET) పరీక్షలో సాంకేతిక సమస్యల వల్ల 3,700 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. వీరికి జూన్ 6, 7 తేదీలలో MeitY ప్రత్యేక సాంకేతిక మద్దతుతో తిరిగి పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే, సీబీఎస్ఈ పోర్టల్పై కూడా కేవలం రెండు నిమిషాల్లో 1.5 మిలియన్ల హిట్స్, లక్షకు పైగా అనధికారిక ఫైల్ యాక్సెస్ ప్రయత్నాలు (DoS యాక్టివిటీ) నమోదయ్యాయి.
డిజిటల్ యుగంలో కఠినమైన భద్రతే శరణ్యం!
భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం డిజిటల్ సేవలను డిజైన్ చేసే దశలోనే సైబర్సెక్యూరిటీ ప్రమాణాలను చేర్చాలని కీలక శాఖలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే పరీక్షల నిర్వహణలో మానవ జోక్యాన్ని తగ్గించేందుకు AI ఆధారిత అనువాద వ్యవస్థలను ఉపయోగించాలని, దాడులకు గురయ్యే అవకాశం ఉన్న పాత డిజిటల్ ఆస్తులను మూసివేయాలని NTA భావిస్తోంది. దేశ విద్యా పర్యావరణ వ్యవస్థ డిజిటల్గా మారుతున్న కొద్దీ, దానికి తగినట్లుగా సైబర్ భద్రతను నిర్మించడం కూడా అంతే ముఖ్యం అని ఈ సంఘటన గట్టి హెచ్చరిక జారీ చేసింది.














Click it and Unblock the Notifications