అలర్ట్: ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవాలల్లో సెప్టెంబర్ 4వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కొంకణ్, గోవాలలో వచ్చే 24 గంటల్లో వర్షాలు పడుతాయని రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గుజరాత్, మరాఠ్వాడతో పాటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఈ మేరకు ఐఎండీ అధికారులు తాజా బులెటిన్ విడుదల చేశారు. సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, ఆ తరువాత స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. వచ్చే 48 గంటల్లో ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఏపీ కోస్తా తీర ప్రాంత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనితోపాటు కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. ఛత్తీస్గఢ్ దక్షిణ ప్రాంతం మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణికి తోడు రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉండటం వల్ల సెప్టెంబర్ 4వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.
తమిళనాడు, కర్ణాటక దక్షిణ ప్రాంతం, ఏపీ కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. కాగా- భారీ వర్షాల వల్ల మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని చాలిస్గావ్ ప్రాంతంలో వరదనీరు ముంచెత్తింది. కన్నడ్ ఘాట్ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదనీరు పోటెత్తడంతో కన్నడ్ ఘాట్లో మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దేశ రాజధానిని మంగళవారం భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అక్షర్ధామ్ టెంపుల్, గోల్ఫ్ క్లబ్ రోడ్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications