నైరుతి జోరు.. వచ్చే వారం వరకు దంచికొట్టనున్న వర్షాలు!
నైరుతి రుతుపవనాల జోరుతో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకుంది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రానున్న కొద్దిరోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. ముఖ్యంగా ఒడిశాలో నేటి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు పర్యాటకులు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఒడిశాతో పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాల కారణంగా ఒడిశాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని, ఈదురుగాలుల వల్ల రహదారి, రైలు రాకపోకలకు ఆటంకం కలిగే ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారు వాతావరణ పరిస్థితులను గమనించి ముందుకెళ్లడం మేలు.

సెప్టెంబర్ మొదటి వారంలోనూ వానల హోరు!
ఈ వర్షాల ఉధృతి ఆగస్టుతోనే ఆగకుండా సెప్టెంబర్ మొదటి వారం వరకు కొనసాగనుంది. ఉత్తరాఖండ్లో నేటి నుంచి సెప్టెంబర్ 4 వరకు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశముంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, విదర్భ ప్రాంతాలలో సెప్టెంబర్ మొదటి వారంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కొంకణ్-గోవా, తీర ప్రాంత కర్ణాటక, కేరళలలో కూడా వానలు బలంగా కురుస్తాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈశాన్య భారతంలో మెరుపులు.. నాలుగు రాష్ట్రాలకు ప్లాష్ ఫ్లడ్స్
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో సెప్టెంబర్ 3, 4 తేదీల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, వర్షాల తీవ్రత వల్ల ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోని పలు నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాలలో ఆకస్మిక వరదలు వచ్చే ముప్పు ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రయాణాల్లో ఉన్నవారు ప్రమాదకరమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు.













Click it and Unblock the Notifications