ఏమైంది ఈ రాజకీయ భీష్ముడికి: సభలో 92శాతం హాజరు... అద్వానీ మాట్లాడిన పదాలు ఎన్నో తెలుసా..?
అది ఆగష్టు 8, 2012. అస్సోంలోకి అక్రమ వలసలు, ఆపై రాష్ట్రంలో జరిగిన హింసలపై లోక్సభలో ఇచ్చిన వాయిదా తీర్మానం పై చర్చ జరుగుతోంది. నాడు విపక్షనేతగా బీజేపీ ఉక్కుమనిషి లాల్ కృష్ణ అద్వానీ ఉన్నారు. ఇక చర్చలో భాగంగా నాడు విపక్షంలో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న అద్వానీ లేచి మాట్లాడటం మొదలు పెట్టారు. సభ అంతా గందరగోళం నెలకొంది. మరోవైపు నాటి రెండో యూపీఏ పై విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అయినా సరే ఎల్కే అద్వానీ తను చెప్పాలనుకున్నది చెప్పేశారు. అయితే ఇది అద్వానీకి తొలిసారి కాదు. ఇలాంటివి ఈ రాజకీయదురందరుడు ఎన్నో ఎదుర్కొన్నారు.
అద్వానీ రాజకీయ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు
ఇక అద్వానీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఆరోజు తాను ప్రసంగించిన ప్రసంగంలో మొత్తం 5వేల పదాలు ఉన్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 4,957 పదాలు ఉన్నాయి. ఆయన ప్రసంగిస్తుండగా కనీసం 50 సార్లు అధికార పక్షం అడ్డు తగిలింది. అయితే ఆ తీర్మానం వీగిపోయినప్పటికీ అద్వానీ మాత్రం తాను చెప్పదలుచుకుంది చెప్పేశారు.
ఇక సీన్ కట్ చేస్తే 2019 జనవరి 8వ తేదీ వచ్చేసింది. ఇప్పుడు అద్వానీ అధికార పక్షంలో ఉన్నారు. సభలో ఎన్డీఏ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇక రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయితే అస్సోంలో సామాజికంగాను రాజకీయంగాను తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. సభలో బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేసిన సమయంలో ఎల్కే అద్వానీ సభలో ఉన్నారు కానీ బిల్లుపై ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. ఇదే అంశంపై ఎనిమిదేళ్ల క్రితం అధికార పక్షం పదేపదే తన ప్రసంగానికి అడ్డుకున్నప్పటికీ అద్వానీ తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. 2008 నుంచి 2018 వరకు చాలా మార్పులు వచ్చాయి. ప్రభుత్వం మారిపోయింది, ప్రతిపక్షం మారిపోయింది.. అలానే అద్వానీ కూడా మారిపోయారు.
లోక్సభ రికార్డులు అద్వానీ గురించి ఏం చెబుతున్నాయి..?
ఇక లోక్సభ రికార్డులు తిరిగేస్తే గత ఐదేళ్లలో ఈ రాజకీయ భీష్ముడు సభలో మాట్లాడింది 365 పదాలేనట. అదే 15వ లోక్సభ(2009-14)తో పోలిస్తే దాదాపు 99శాతం తగ్గుదల కనిపించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇక 2009-14 వరకు ఎల్కే అద్వానీ 42 డిబేట్లలో పాల్గొంటే ఆయన మాట్లాడిన పదాలు 35,926గా రికార్డు అయ్యాయి. ఇక 16వ లోక్సభ మొత్తంలో ఆయన మాట్లాడిన పదాలు 365. అదికూడా 2014లోనే ఆయన మాట్లాడారు. ఇక 19 డిసెంబర్2014 నుంచి అద్వానీ నోరుతెరిచి మాట్లాడలేదని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే అద్వానీ పెద్ద వక్త కాదని అనుకుంటే పొరపడినట్లే. ఆయన రాసిన మై కంట్రీ మైలైఫ్ పుస్తకంలోని వెయ్యిపేజీలు ఆయన అంతరంగాన్ని ఆయన మాటలను ఆవిష్కరిస్తాయి.
అద్వానీ ఏయే సందర్భాల్లో నోరు విప్పారు..?
ఇక బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ ఇప్పటి వరకు 11 సార్లు ఎంపీ అయ్యారు. ఇప్పటి వరకు బతికున్న బీజేపీ సీనియర్ నేతల్లో అద్వానీనే సీనియర్ అని చెప్పొచ్చు. ఇక దేశంలో బీజేపీ బలోపేతం చేసిన వారిలో అద్వాని కృషి కొనియాడదగినది. అయితే 16వ లోక్సభలో ఆయన కేవలం ఐదు సందర్భాల్లో మాత్రమే మాట్లాడినట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. ఈ ఐదింటిలో ఒకసారి స్పీకర్ ఎన్నకి సమయంలో మరోసారి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలో మాట్లాడగా.. ఇక మిగతా సార్లు సభలో ప్రవేశపెట్టిన బిల్లులకు తాను మద్దతు తెలుపుతున్నాను అని మాత్రమే చెప్పారట. అదే 2009లో స్పీకర్గా మీరాకుమార్ను ఎన్నుకున్న సమయంలో అద్వానీ ఆమెను అభినందిస్తూ 440 పదాలు మాట్లాడారు. గతఐదేళ్లతో పోలిస్తే 80 పదాలు ఎక్కవే నాడు మాట్లాడారు. ఇక 2014 నుంచి 2019 వరకు మరో రెండు సందర్భాల్లో అద్వానీ మాట్లాడారు. పార్లమెంటరీ కమిటీలోని సభ్యునిగా తన నివేదికను సభలో ప్రవేశపెట్టిన సమయంలో మాట్లాడారు. అప్పుడు "రిపోర్టును సభలో ప్రవేశ పెడుతున్నాను" అని మాత్రమే మాట్లాడారు. ఇక చివరిసారిగా అద్వానీ కశ్మీర్లోకి వస్తున్న వలసదారులపై ఇచ్చిన రిపోర్టును సభలో ప్రవేశపెట్టిన సమయంలో రిపోర్టును మరోసారి పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని మాట్లాడారు.