కేరళలో దారుణం: మహిళా పోలీసు ఆఫీసర్ను నరికి నిప్పుపెట్టిన మరో పోలీసు
అలపుజా: కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళా పోలీస్ అధికారిణికి నిప్పుపెట్టాడు మరో ట్రాఫిక్ పోలీస్. ఈ ఘటన అలపుజా జిల్లాలో చోటుచేసుకుంది. సౌమ్య పుష్పకరన్ అనే మహిళా పోలీసు అధికారిణిని మావిలిక్కరలోని వల్లికున్నం పోలీస్ స్టేషన్లో పనిచేస్తోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త విదేశాల్లో పనిచేస్తున్నారు.
సౌమ్య తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా నిందితుడు అజాజ్ అనే ట్రాఫిక్ పోలీసు తన కారుతో ఆమెను ఢీకొట్టాడు. ఆ సమయంలో ఆమె తన విధులను ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో అజాజ్ తన కారుతో ఢీకొట్టాడు. వెంటనే తన కారులోనుంచి మచ్చుకత్తితో దిగాడు. నిందితుడి చేతిలో కత్తిని చూసిన సౌమ్య ప్రాణాలు కాపాడుకునేందుకు దగ్గరలోని ఓ ఇంట్లోకి పరుగులు తీసింది. అజాజ్ ఆమెను వెంబడించి కత్తితో ఓ వేటు వేశాడు. సౌమ్య కింద పడిపోగానే ఆమెపై పెట్రోలు పోసి నిప్పు పెట్టాడు. మంటల్లో చిక్కుకున్న సౌమ్య గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.
నిందితుడు అజాజ్కు కూడా గాయాలు అయ్యాయి. ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గాయాలు కావడంతో అజాజ్ను చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఇదిలా ఉంటే అజాజ్ అలువా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసుగా పనిచేస్తున్నాడు. అయితే అసలు దాడి ఎందుకు చేశాడో అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒక మహిళా పోలీసును నడిరోడ్డుపైనే నరికి ఆ తర్వాత నిప్పుపెట్టిన ఘటన చూసిన వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఉదంతం పలువురిని కంటతడి పెట్టించింది. అజాజ్ అసలు ఎందుకు దాడి చేశాడో వారిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందో అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటనతో అలపుజా జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.