అసెంబ్లీలో బెంచ్ పైకి ఎక్కి నిలబడ్డ బీజేపీ ఎమ్మెల్యే
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో జరిగిన జరిగిన సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ అవుతోంది. ఢిల్లీ శాసనసభలో విపక్ష నేతగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా అసెంబ్లీలో బెంచ్ ఎక్కారు. ట్యాంకర్ల స్కాం గురించి నిరసన వ్యక్తం చేసేందుకు ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నారు.
విజేంద్ర గుప్తా ఉన్నపళంగా బెంచ్ పైకి ఎక్కడంతో సభాపతి, ఇతర సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ విధంగా నిరసన తెలియజేసిన వారిని తాను ఇంతవరకూ చూడలేదంటూ స్పీకర్ రామ్ నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ స్పీకర్ మందలించారు.
విజేంద్ర గుప్తా ఏ మాత్రం తగ్గలేదు. ఆ సమయంలో సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా సభలోనే ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే బెంచ్ పైకి ఎక్కడాన్ని సహ సభ్యులు కొందరు తమ సెల్ ఫోన్లలో వీడియో తీసుకున్నారు. మరికొందరు ఫొటోలు తీసుకున్నారు.
విజేంద్ర గుప్తా నిరసన మధ్యే కేజ్రీవాల్ అవినీతి అంశాన్ని సభలో లేవనెత్తారు. జల్ బోర్డుకు సంబంధించిన నిజనిర్దారణ నివేదకను తాను సభకు సమర్పిస్తానని చెబుతూనే, మీ భార్యకు ప్రమేయం ఉన్న పెన్షన్ స్కామ్ రిపోర్టును తనకు ఇవ్వగలరా అని గుప్తాను కేజ్రీవాల్ ప్రశ్నించారు.
గుప్తా అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేయడాన్ని బీజేపీ నేత ఆర్పీ సింగ్ సమర్ధించారు. అవినీతి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు సభ్యుడికి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వకపోతే ఎవరైనా ఏమి చేస్తారని, గుప్తా చేసింది కూడా అదేనని వ్యాఖ్యానించారు.