దావూద్ ముఠాదేనా?: గోనె సంచుల్లో రూ. 45కోట్లు
కోల్కతా: నగరంలో గురువారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడిలో రూ.45కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 16 గోనె సంచులు, 27 ట్రావెలింగ్ బ్యాగులు, 2 అల్మారాల్లో ఉంచిన నగదును కొద్ది సేపట్లో హవాలా మార్గాల్లో దుబాయికి తరలిస్తారనగా అధికారులు పట్టుకున్నారు.
ఈ నగదు నకిలీ లాటరీల రాకెట్ ద్వారా దావూద్ ఇబ్రహీం ముఠా సంపాదించినదని భావిస్తున్నారు. తమిళనాడు వరకు వేళ్లూనుకున్న నకిలీ లాటరీ రాకెట్ గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఇచ్చిన సమాచారం మేరకు గురువారం తెల్లవారు జామున కోల్కతాలోని రెండు సంస్థల(జి సిస్టమ్స్, ఎఫ్పి ఎంటర్ప్రైజెస్) కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
కాగా, వాటి యజమానులు పరారీలో ఉన్నారు. రాకెట్ సూత్రధారులైన నాగరాజన్, శాంటియాగో మార్టిన్లు దర్యాప్తు సంస్థల నిఘాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
మార్టిన్ను రెండేళ్ల క్రితం ఈడీ అధికారులు చెన్నైలో పట్టుకున్నారు. రూ.7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ లాటరీల రాకెట్ విలువ వెయ్యి కోట్లుంటుందని సమాచారం. సిలిగురిలోజరిపిన దాడిలో ఈ రాకెట్కు సంబంధించి బ్యాంకు ఖాతాల వివరాలు దొరికాయి.