చైనాతో చర్చలు ఫలించాయన్న కేంద్రం - లదాక్లో తగ్గని టెన్షన్ - రెండు నాలుకల డ్రాగన్
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సైనిక స్థాయిలో చర్చలు విఫలం కావడంతో దౌత్య మార్గంలో రెండు దేశాలూ భేటీ అయ్యాయి. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) విధానంపై భారత్, చైనా విదేశాంగ శాఖలు గురువారం సమావేశమయ్యాయి. దీనికి సంబందించిన వివరాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు.
భారత్ చైనా మధ్య సుహృద్భావ వాతావరణంలో, లోతైన చర్చలు జరిగాయని, తూర్పు లదాక్ లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు రెండు దేశాలూ అంగీకారానికి వచ్చాయని అధికారి శ్రీవాస్తవ తెలిపారు. ''సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలు కొనసాగించాల్సిన అవసరాన్ని రెండు దేశాలూ గుర్తించాయి. సంబంధాలు మరింత మెరుగుపడటానికి, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి పునరుద్ధరణకు రెండు దేశాలు అంగీకరించాయి. తద్వారా చర్చలు ఫలించినట్లుగా భావించొచ్చు''అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే,
చైనా -పాక్ ప్లాన్: భారత్పై అణుయుద్ధం - ముస్లింలపై పడకుండా బాంబులేస్తాం - పాక్ మంత్రి ప్రేలాపన
చర్చలు ఫలించాయంటూ శ్రీవాస్తవ ప్రకటన చేసే సమయానికి సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉండటం గమనార్హం. ఎల్ఏసీ వెంబడి భారత్ కు అతి కీలకమైన దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో చైనా ఇప్పటికే 15 వేల మంది జవాన్లను దింపింది. దెప్సాంగ్ లో చైనా మోహరింపులు పెరిగిన నేపథ్యంలో భారత్ సైతం అదే స్థాయిలో బలగాలను కొనసాగించాలని నిర్ణయించుకుంది. రెండు వైపులా యుద్ధ విమానాలను సైతం మోహరించారు. గురువారం నాటి దౌత్య స్థాయి చర్చల తర్వాత సైనిక వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఒకేచోట వైసీపీ,బీజేపీ స్క్రిప్ట్-ట్యాపింగ్ కేసులో కేంద్రం ప్రతివాది - 'కమ్మ'కాబట్టే కక్ష: టీడీపీ ఫైర్
మే మొదటి వారం నుంచి తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయ, పాంగాగ్ సరస్సు, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో భారత జవాన్లకు అడ్డుతగులుతూ చైనా కవ్వింపులకు దిగింది. జూన్15నాటి హింసాత్మక ఘటనలో మన జవాన్లు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత చర్చల ప్రక్రియ వేగం పెరిగింది. ఏప్రిల్ ముందు నాటి యథాతథ పరిస్థితులు (స్టేటస్ కో) ఉండాలన్న భారత్ ప్రతిపాదనను చైనా ఎంతకీ అంగీకరించలేదు.
అయితే, బలగాల ఉపసంహరణ(డీఎస్కలేషన్) కు మాత్రం అంగీకారం కుదిరింది. కానీ రోజుల వ్యవధిలోనే చైనా యూటర్న్ తీసుకుంది. గాల్వాన్ నుంచి వెళ్లినట్లే వెళ్లి, మళ్లీ దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో తిష్టవేసింది. చైనా బలగాలకు దీటుగా భారత్ సైతం సైన్యాల మోహరింపును కొనసాగిస్తున్నది. డ్రాగన్ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నవేళ గురువారం నాటి చర్చల తర్వాతైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.