ఇండో-చైనా బోర్డర్ టెన్షన్స్.. ఘర్షణల్లో అమరులైన 20 మంది భారత జవాన్లు వీరే..
భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ వ్యాలీలో ఇరు దేశాల సైన్యం మధ్య తలెత్తిన ఘర్షణల్లో అమరులైన భారతీయ సైనికుల పేర్లను ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. మొదట కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ సహా మరో ఇద్దరు సైనికులు మృతి చెందినట్టు మంగళవారం(జూన్ 16) ఉదయం ఆర్మీ వెల్లడించింది. కానీ మొత్తం 20 మంది చనిపోయినట్టు సాయంత్రానికి మరో ప్రకటన విడుదల చేసింది. చైనా సైనికులు కూడా 43 మంది చనిపోయినట్టు చెబుతున్నప్పటికీ.. డ్రాగన్ కంట్రీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.

అమర జవాన్లు వీరే..
కల్నల్ బి.సంతోష్ బాబు,ఎన్బీ సబేదార్ నుదురాం సొరెన్,ఎన్బీ సబేదార్ మందీప్ సింగ్,ఎన్బీ సుబేదార్ సత్నం సింగ్,హవ్ కె పళని,హవ్ సునీల్ శర్మ,హవ్ విపుల్ రాయ్,ఎన్కే దీపక్ కుమార్,సిపాయి రాజేశ్ ఒరంగ్,సిపాయి కుందన్ కుమార్ ఓజా,సిపాయి గణేశ్ రామ్,సిపాయి చంద్రకాంత ప్రధాన్,సిపాయి అంకుశ్,సిపాయి గురుతేజ్ సింగ్,సిపాయి చందన్ కుమార్,సిపాయి కుందన్ కుమార్,సిపాయి అమన్ కుమార్,సిపాయి జై కిశోర్ సింగ్,సిపాయి గణేశ్ హన్స్ద.. వీరంతా సోమవారం రాత్రి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో జరిగిన ఘర్షణల్లో చనిపోయినట్టు భారత ఆర్మీ అధికారికంగా వెల్లడించింది.

మోదీ అఖిలపక్ష సమావేశం..
భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఏ క్షణాన ఎటు దారితీస్తాయో తెలియని ఉత్కంఠ రేపుతున్నాయి. ఓవైపు కరోనాతో ఇరు దేశాలు పోరాడుతున్న సమయంలోనే మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా పరిస్థితులపై చర్చించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19 సాయంత్రం ఆన్లైన్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. పలు పార్టీలకు చెందిన అధినేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
Recommended Video

ధీటుగా బదులివ్వగలం.. : మోదీ
'భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది.. కానీ అవతలి వైపు నుంచి రెచ్చగొట్టుడు ధోరణి ఉన్నప్పుడు.. అందుకు ధీటుగా సమాధానం చెప్పగలదు.. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే...' అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యల్లో చైనా దూకుడు చర్యలను ఉపేక్షించేది లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానికి వరుస ప్రశ్నలు సంధించారు. భారత భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించుకుందో.. 20 మంది సైనికులు ఎలాంటి పరిస్థితుల్లో అమరులయ్యారో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. సరిహద్దు ఉద్రిక్తతలను డీల్ చేయడంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారో చెప్పాలన్నారు. 20 మంది జవాన్లు అమరులవడం యావత్ దేశాన్ని కదలించిందని.. వారికి తన నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబాలకు ఆత్మస్థైర్యం కోసం ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications